వరంగల్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ గురించి మాట్లాడితే.. అందరూ తిడుతున్నరు సర్.. అంటే.. తిట్లు తినండి.. మేం పోరాటం చేస్తున్నది మీ కోసమే కదా.. తెలంగాణ వస్తే ఆ ఫలితాలు అనుభవించేది మీరే.. ఇప్పుడు తిట్లు తింటే పోయిందేం లేదు..’ తెలంగాణ ఉద్యమ కాలంలో జయశంకర్ సారు అన్న మాటలివి. సారు మాట తెలంగాణకు విజయబాట. సారు వ్యూహం తెలంగాణ కల సాకారం. సైద్ధాంతిక తెలంగాణకు వ్యూహకర్త సారు. సారు యాదిలేని మది తెలంగాణల ఒక్కటన్న ఉంటదా? మది మదిలో తెలంగాణ మది మదిలో శాశ్వతంగా నిలిచిన యాది సారు. సారు లేని తెలంగాణను ఊహించుకోవడమే కష్టం. సారు యాదిని శాశ్వతం చేయడంకోసం చారిత్రక నగరం వరంగల్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరిట స్మృతి వనాన్ని అభివృద్ధి చేసింది. సారు భౌతికంగా దూరమైన తర్వాత ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని హన్మకొండలోని ఏకశిలా పార్కులోనే ఉంచిన విషయం అందరికీ తెలిసిందే. అదే ఏకశిలా పార్కును రాష్ట్ర ప్రభుత్వం ‘జయశంకర్ స్మృతి వనం’గా మార్చింది. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ నిలువెత్తు విగ్రహంతోపాటు స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అహ్లాదమైన ప్రదేశంగా తీర్చిదిద్దింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపు రూ.4.50 కోట్లతో దీన్ని అభివృద్ధిచేశారు. ఇటీవలే తుది మెరుగులు దిద్దుకుంది. అన్ని హంగులతో దీన్ని అభివృద్ధి చేశారు. జయశంకర్ స్మృతి వనం ఇప్పుడు వరంగల్ నగరంలో కొత్త పర్యాటక ప్రదేశంగా ప్రజలను ఆకట్టుకుంటున్నది. పార్కు అంతా పచ్చదనం ఉండేలా గ్రీనరీ పెంచారు. పార్కులో పెంచిన రకరకాల మొక్కలు కనువిందు చేస్తున్నాయి. ప్రైవేట్ జిమ్లలో కూడా లేని పరికరాలు, పిల్లలకు ప్రత్యేకంగా ఆట స్థలం, వాకింగ్ ట్రాక్, పాత్వేలు ఏర్పాటు చేశారు. నిత్యం బిజీగా గడిపే నగర ప్రజలకు స్మృతి వనం ఆహ్లాదకేంద్రంగా మారనుంది.
యోగా సెంటర్ , రాక్ ైక్లెంబింగ్
జయశంకర్ స్మృతి వనంలో యోగా కేంద్రం, రాక్ ైక్లెంబింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కుటుంబాలతో స్మృతివనానికి వచ్చే వారికి కావాల్సిన ఆహ్లాదం, ఆనందం పంచేలా అభివృద్ధి చేసింది. ప్రశాంత వాతావరణంలో పెద్దలు, పిల్లలు యోగా చేసుకునేలా ప్రత్యేక ప్లాట్ ఫాం నిర్మించారు. స్మృతివనంలోని పార్కులో గ్రానైట్తో కాకతీయ ఆర్చ్ ఏర్పాటు చేశారు. గ్రానైట్ నిర్మాణాలతో స్మృతి వనానికి కొత్త అందాలు వచ్చాయి. రూ.4.50కోట్లతో స్మృతి వనాన్ని పూర్తి చేస్తున్నారు.