హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): వానకాలం ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం వరకు 60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దీని విలువ రూ.11,550 కోట్ల దాకా ఉంటుంది. 19 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వడంతో 3,382 కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. మరో 3,252 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వరి కోతలు పూర్తికావాల్సి ఉన్నది. కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఇంకా 30 లక్షల టన్నుల దాకా ఉంటుందని అధికారుల అంచనా. లక్ష్యానికి మించి వస్తున్న ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పందించడం లేదు. వానకాలంలో ఎంత ధాన్యం ఉత్పత్తి అయినా కొనుగోలు చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రులు ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. దీంతో కేంద్రం నుంచి రాతపూర్వక హామీ రాబట్టేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. మిగిలిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రైతులకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే భరోసా ఇచ్చారు.