Balka Suman | తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉప్పెనలా కదిలారు. అందులో ఉస్మానియా విద్యార్థి బాల్క సుమన్ ఒకరు. తండ్రి అందించిన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. విద్యార్థి లోకాన్ని ఉద్యుక్తులను చేశారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమానికి బాసటగా నిలిచారు. కేసీఆర్ వెంటే నడిచారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. బాల్క ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచిత నోట్బుక్లు పంపిణీ చేశారు. ఉన్నత చదువులకు, కష్టాల్లో ఉన్న పేదలకు ఆర్థిక సాయం, 3వేల మందికి ఉచిత కోచింగ్ ఇప్పించారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లు నిర్వహించగా అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వారిలో 30 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని…
బాల్కసుమన్ స్వస్థలం జగిత్యాల జిల్లా, మెట్పల్లి మండలంలోని రేగుంట గ్రామం. తండ్రి బాల్క సురేశ్ మెట్పల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. అదే స్ఫూర్తితో సుమన్ 2001లో టీఆర్ఎస్లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2007లో ఓయూలో టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా, 2010లో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన తొలి ఎన్నికలో 2014లో పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2018లో చెన్నూర్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రభుత్వ విప్ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం మళ్లీ చెన్నూరు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.
చెన్నూర్ దశ మార్చిన యువనేత..
యువనాయకుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో చెన్నూర్ నియోజకవర్గం దశ మారింది. ప్రజల చిరకాల స్వప్నమైన చెన్నూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యింది. బస్ డిపో మంజూరయ్యింది. అస్నాద్, పారుపల్లిలను రెండు కొత్త మండలాలుగా ఏర్పాటు చేశారు. 100 పడకల జనరల్ హాస్పిటల్ పనులు పురోగతిలో ఉన్నాయి. 50 పడకల మాతా,శిశు సంక్షేమ ఆసుపత్రిని ప్రారంభించారు. మందమర్రిలో రూ.500 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. చెన్నూర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.