హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): సత్వర సాగునీటి ప్రా యోజిత కార్యక్ర మం (ఏఐబీపీ), ఆర్ఆర్ఆర్, క్యా చ్మెంట్ ఏరి యా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకాల కింద చేపట్టిన ప్రాజెక్టుల పనులను వచ్చే జూన్లోగా పూర్తి చేయాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అధికారులను ఆదేశించారు. ఆ పథకాల కింద చేపట్టిన పనుల పురోగతిపై ఈఎన్సీ మురళీధర్తో కలిసి అన్ని టెరిటోరియల్ చీఫ్ ఇంజినీర్లతో జలసౌధలో గురువారం వర్చువల్గా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
తొలుత ఆయా పథకాల కింద కొనసాగుతున్న పనుల పురోగతిని తెలుసుకున్నారు. నెమ్మదిగా సాగుతున్న పనులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రజత్కుమార్ మాట్లాడుతూ.. ఏఐబీపీ కింద మేజర్, మీడియం కలిపి మొత్తంగా 11 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అందులో దేవాదుల, పెద్దవాగు, రాజీవ్భీమా తదితర ప్రాజెక్టుల పనులు మాత్రమే కొనసాగుతున్నాయని వెల్లడించారు. కొన్ని చోట్ల భూసేకరణ జాప్యంతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఇందుకు రూ.140 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయాల్సి ఉన్నదని చెప్పారు.
రిపేర్, రెనోవేషన్ అండ్ రిస్టోరేషన్(ఆర్ఆర్ఆర్) పథకం కింద మొత్తం 575 చెరువులకు మరమ్మతులు చేపట్టగా, ఇప్పటికే 465 చెరువుల పనులు పూర్తయ్యాయని రజత్కుమార్ వెల్లడించారు. మరో 30 పనులను ఆ లిస్టు నుంచి ఉపసంహరించుకున్నామని, మిగతా చెరువుల పనులు 78 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. పథకం కింద కేంద్రం రూ.106 కోట్లను ఖర్చు చేయగా, తెలంగాణ ప్రభుత్వం రూ.168 కోట్లను వెచ్చించిందని తెలిపారు. కేంద్రం నుంచి రూ.80 కోట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు. నిధులు రాగానే పనులన్నీ పూర్తి చేస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 1,200 చెక్డ్యామ్లు నిర్మించాలని నిర్ణయించగా, మొదటి విడతగా 638 చెక్డ్యామ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. అందులో ఇప్పటికే 169 పనులు పూర్తి కాగా, మిగతా పనులన్నీ తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.
కేంద్ర జల్శక్తిశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ పథకం కింద సంగారెడ్డిలో 5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 కొత్త చెరువుల తవ్వకం కోసం రూ. 240కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు రజత్కుమార్ తెలిపారు. వీటి ద్వారా 2,630 హెక్టార్లకు నీరందుతుందని చెప్పారు. వెంటనే ప్రతిపాదనలను కేంద్రానికి పంపాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ సెక్రటరీ భీమ్ప్రసాద్, గజ్వేల్ ఈఎన్సీ హరిరాం, ప్రాజెక్టు అండ్ మానిటరింగ్ సీఈ చంద్రశేఖర్, ఎస్ఈ శ్రీనివాస్, కాడా ఎస్ఈ పరిమళతో పాటు అన్ని టెరిటోరియల్స్ సీఈలు తదితరులు పాల్గొన్నారు.