సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి తీగుల్ల పద్మారావుగౌడ్కు మద్దతుగా శుక్రవారం రాత్రి సికింద్రాబాద్, సనత్నగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. సికింద్రాబాద్లోని అడ్డగుట్ట రియో పాయింట్, సీతాఫల్మండి, సనత్నగర్లోని బబ్బార్ కాంప్లెక్స్, నాంపల్లిలోని నోబుల్ టాకీస్ చౌరస్తా వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆప్రాంతాలన్నీ గులాబీమయమయ్యా. జై తెలంగాణ.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు.
BRS | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించడంలేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థగా ఉన్న ఎన్నికల సంఘం అన్ని పార్టీలను ఒకే తీరుగా చూడాలని, అలాకాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. స్వేచ్ఛగా, ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే ఎన్నికల సంఘం వ్యవహరించాల్సి తీరు ఇది కాదని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 28 ఫిర్యాదులను చేసింది. అయినా కూడా ఒక్కదానిపై సరైన విధంగా సరైన సమయంలో స్పందించడంలేదని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై 8 ఫిర్యాదులు చేశారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు.
రేవంత్రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఆంధ్రజ్యోతి పత్రికా యాజమాన్యం వేమూరి రాధాకృష్ణ, కే.శేషగిరిరావు, ఎడిటర్ కే.శ్రీనివాస్పై, బీజేపీ నేతలు రఘనందన్ రావు, బండి సంజయ్లపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి ప్రతి సభలోనూ నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. ఆధార రహిత ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా దేవుడిపై ఒట్టు వేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్ను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేసినా కూడా ఈసీ స్పందించడంలేదని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వీటన్నింటిపై వీడియో ఆధారాలను సేకరించిన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే మంత్రి కొండా సురేఖకు వార్నింగ్ ఇవ్వడం మినహా చర్యలేమీ తీసుకోలేదని చెబుతున్నారు.