హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ శామీర్పేటలో ఉన్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరిగాయనే అభియోగాలపై కేంద్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేరింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి డిప్యుటేషన్పై వైస్చాన్స్లర్గా వచ్చిన ఫైజాన్ముస్తఫా వర్సిటీ చాన్స్లర్గా ఉన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పుదారి పట్టించారని కేంద్రానికి ఫిర్యాదు అందింది. ముస్తఫాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు, నిధుల దుర్వినియోగం, ఇద్దరు ప్రొఫెసర్ల అండతో అక్రమాలకు పాల్పడటం, రిటైరైన ప్రొఫెసర్ అధికారిక సమావేశాల్లో పాల్గొంటున్నారని ఉపకులపతిపై న్యాయవాది మల్లేశ్యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.