శేరిలింగంపల్లి, మే 22 : చిత్రపురికాలనీలోని ఫ్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు ‘తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ను రాయదుర్గం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ చిత్రపురికాలనీలో ఫ్లాట్లను అర్హులకు కేటాయించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. కాగా తమకు చేసిన అలాట్మెంట్ను రద్దుచేసి వేరొకరికి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సొసైటీ అధ్యక్షుడు అనిల్కుమార్ను అరెస్టు చేయడంతోపాటు కమిటీ సభ్యులు పరుచూరి వెంకటేశ్వర్రావు, వినోద్బాల, చంద్రమధు, కాదంబరి కిరణ్, మహానంద రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేశ్, మరికొందరిపై 420, 120బీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రూ.12 లక్షలు చెల్లిస్తే ఫ్లాట్ను తనకు బదులు మరో వ్యక్తికి రిజిస్ర్టేషన్ చేశారని మార్చి 7న తోటశ్రీ పద్మ రాయదుర్గం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను రూ.4లక్షలు చెల్లించిన తర్వాత సదరు అలాట్మెంట్ను కమిటీ సభ్యులు రద్దుచేసి డబ్బులు తిరిగి ఇవ్వలేదని మార్చి 20న యనమల మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయశ్రీ, శ్రావణ్ కుమార్, కాట్రగడ్డ రవితేజ, బక్కి విద్యతో పాటు మరికొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు చెల్లించినా ఫ్లాట్ల అలాట్మెంట్ రద్దయిన బాధితుల సంఖ్య దాదాపు 150 వరకు ఉంటుందని, ఒక్కో బాధితుడి వద్ద సుమారు రూ.4 లక్షల నుంచి రూ.40 లక్షల దాకా వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. హౌసింగ్ సొసైటీ సభ్యులు అనర్హులకు ఇండ్లు కేటాయించి కోట్ల రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. చిత్రపురికాలనీ ఫ్లాట్ల అలాట్మెంట్ కుంభకోణంలో అధికారుల పాత్ర, అర్హుల వద్ద వసూలు చేసిన డబ్బు ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.