ములుగు, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఇసుక మాఫియా సూత్రధారులను బయటకు లాగాలని రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతితో కలిసి కలెక్టర్ హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ మహేందర్జీకి మంగళవారం ఆధారాలతో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న విమర్శలను ఇంటెలిజెన్స్ రిపోర్టు, సర్వేల ద్వారా తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు అక్రమ దందాలు, స్కామ్లు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మాఫియా అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నా.. అధికారులు, స్థానిక మంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంకటాపురం(నూగూరు), వాజేడు, మంగపేట మండలాల్లో 12 కోట్ల క్యూబిక్ మీటర్లకు సీతమ్మసాగర్ పేరుమీద దరఖాస్తు చేస్తే కోటి క్యూబిక్ మీటర్లకు అనుమతులు వచ్చాయని తెలిపారు. ఇటీవల కేటీఆర్ పాలేరుసభలో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వుతున్నారని, ఇందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క పాత్ర ఉందని, రూ.4 వేల కోట్ల అక్రమార్జనకు స్కెచ్ వేశారని ఆరోపించారని గుర్తుచేశారు.
దీనిపై కొంతమంది నాయకులు కేటీఆర్ క్షమాపణలు చెప్పాలనడం హాస్యాస్పదమని ఎద్దేవాచేశారు. ఈ విషయంపై ఇసుక ఎక్కడి నుంచి తీస్తున్నారు..? ఎక్కడ డబ్బులు ఇస్తున్నారు…? ఏ మిషన్తో తవ్వుతున్నారు..? ఎక్కడ డంపు చేస్తున్నారు..? అనే విషయాలపై వీడియోలతో తాను ప్రెస్ మీట్ పెట్టి వివరించినట్టు వెల్లడించారు. వాస్తవాలను జీర్ణించుకోని కాంగ్రెస్ నాయకులు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ ఇసుక దందాలో మంత్రి సీతక్క, పొంగులేటి ప్రమేయం ఉందో లేదో మేడారం సమ్మక్క-సారలమ్మ సాక్షిగా వారు ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరితే మరొకరు సమాధానాలు చెబున్నారని, దీనిపై మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీతమ్మసాగర్లో ముంపు గ్రామం లేదని ఆర్టీఐ ద్వారా అధికారులు సమాధానం ఇచ్చారని తెలిపారు. ముంపు ప్రాంతం లేనప్పుడు సీతమ్మసాగర్లోని రమణక్కపేటలో 10 లక్షల క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఎలా ఇచ్చారని, ఆర్టీఐలో లేని ముప్పు ప్రాంతం ఇసుక దందాకు ఇచ్చిన ఆర్డర్లోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇసుక దందాపై చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.