Congress | నాగర్కర్నూల్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు టికెట్ కుంపట్లు అప్పుడే రాజుకున్నాయి. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం మహబూబ్నగర్ నుంచి నలుగురు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఎస్సీ రిజర్వుడు స్థానమైన నాగర్కర్నూల్ నుంచి మాత్రం ఏకంగా 26 మంది ముందుకొచ్చారు. వీరిలో రాష్ట్రస్థాయిలో కీలక దళిత నేతలైన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ మల్లురవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చారకొండ వెంకటేశ్ ఉండడంతో వీరి మధ్య పోటీ తీవ్రమైంది. టికెట్ల ఖరారు కీలక దశకు చేరుకోవడంతో ఇరువురు నేతలు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, పోస్టర్లు హాట్ టాపిక్గా మారాయి. టికెట్ కోసం పోటీని బహిర్గతం చేయడంతో రాబోయే రోజుల్లో ఈ అంశం కాంగ్రెస్లో మంటలను మరింత రాజేస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.
నాగర్కర్నూలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 26 మందీ ఎవరికీ వారే అప్పుడే పైరవీలు మొదలుపెట్టారు. టికెట్ తమకేనంటూ తమ వర్గీయుల ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. మల్లురవి, సంపత్కుమార్ పోస్టర్లు, హోర్డింగులు రాత్రికి రాత్రే ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పుట్టుకురావడం పార్టీలో మరింత కాకరేపింది.కందనూలు అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమంటూ సంపత్ పేరిట హోర్డింగ్స్ దర్శనమిచ్చాయి. పార్టీశ్రేణులను ఇది మరింత గందరగోళానికి గురిచేసింది. టికెట్ ఆశావహులందరూ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో మల్లు రవి తాను పోటీ ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి ఇందుకు అడ్డు కాబోదని స్పష్టం చేశారు. సంపత్ కూడా ఏఐసీసీలో కీలక నేతగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ రేవంత్రెడ్డికి అండగా నిలిచారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన మందా జగన్నాథం నాలుగుసార్లు ఎంపీగా పనిచేశారు. మరోనేత చారకొండ వెంకటేశ్ సైతం పోటీలో ఉన్నానని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయనకు టికెట్ ఖరారైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతున్నది. ఎవరికి వారే టికెట్ తమకేనని ప్రకటించుకోవడంతో కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. టికెట్ ఎవరికి వస్తుందో? ఎవరికి మద్దతు ఇవ్వాలో? తెలియక అయోమయానికి గురవుతున్నారు.
ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని అలంపూర్, జోగుళాంబ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా, నాగర్కర్నూల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేటలోనూ బీఆర్ఎస్ స్థానికంగా బలీయంగానే ఉన్నది. నాగర్కర్నూల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీ ప్రాతినిథ్యం వహిస్తుండగా సిట్టింగ్ స్థానం నిలబెట్టుకొనేందుకు ఇప్పటికే హైదరాబాద్లో మాజీమంత్రి హరీశ్రావు సమక్షంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై మార్గనిర్దేశనం చేశారు. అంతర్గత సర్వేల్లోనూ బీఆర్ఎస్ తిరిగి గెలుపొందుతుందని స్పష్టమైంది. దీంతో బలమైన బీఆర్ఎస్ను ఎదుర్కోవడం గ్రూపు తగాదాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవి చూడవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.