తుర్కయంజాల్ : కొహెడ మార్కెట్ ( Koheda market ) లో భూములు కోల్పోతున్న దళిత కుటుంబాలకు నష్టపరిహరం అందించాలని కోరుతూ దళిత రైతులు ( Dalit families) సోమవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధి కొహెడ రెవెన్యూ సర్వే నంబర్ 167/1లో తరతరాలుగా దళిత కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వివరించారు.
ఈ భూమిని మార్కెట్ పేరుతో ఎలాంటి నష్టపరిహరం చెల్లించకుండా లాక్కోవడమే కాకుండా ఎస్సీల హక్కులను కాలరాస్తూ అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహరం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ దళిత రైతులకు చెందిన భూములను దౌర్జన్యంగా లాక్కోంటున్నారని ఆరోపించారు.
నష్టపరిమరం చెల్లించాలని కోరిన రైతులతో పాటుగా మద్దతుగా నిలిచిన స్థానిక నాయకులపై కేసులు నమోదు చేయిస్తుందని అన్నారు. రైతులకు నష్టపరిహరం చెల్లించడంతో పాటుగా ఎకరాకు 600 గజాల స్థలం కేటాయించాలని ఎస్సీ కమిషన్ను కోరారు. కార్యక్రమంలో కొహెడ జేఏసీ సభ్యులు కందాళ బలదేవరెడ్డి,రాంరెడ్డి, కొహెడ రైతులు, నాయకులు పాల్గొన్నారు.