AP Politics | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కుల పిచ్చి రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ఆగమైందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గత 9 ఏండ్లుగా చంద్రబాబు, జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని, ఫలితంగా ఏపీలో అభివృద్ధి, సంక్షేమం అడ్రస్ లేకుండా పోయాయని చెప్పారు. ఇద్దరు సీఎంలను చూసిన ఏపీ ప్రజలకు ఇంకా రాజధాని నిర్ణయం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో నంద్యాల, ప్రకాశం, కర్నూల్ సహ పలు జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందినవారు భారీఎత్తున బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేవలం 19 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న సింగపూర్ ప్రపంచానికే తలమానికమైందని, అదే దాదాపు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న ఏపీలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. ప్రజల పట్ల చిత్తశుద్ధిలేని నాయకులు, పాలకుల వల్లే పరిస్థితి ఇలా తయారైందని అన్నారు. దురదృష్టవశాత్తు ఏపీలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ మోదీ చంకలో చేరాయని, అందువల్లే రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించే గొంతు లేకుండా పోయిందని విమర్శించారు.
కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాలు సాగుతున్నాయని, ఇలాంటి సామరస్య పాలనే దేశమంతా రావాలని, కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని వేముల అన్నారు. ఉద్యమ సమయంలోనే కాదు.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య సఖ్యత, సహజీవనం పరిఢవిల్లుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ఏపీలో విస్తరిస్తున్న క్రమంలో ఆ రాష్ట్రంలో కొంతమంది కేసీఆర్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రధాని అయితేనే దేశం బాగుపడుతుందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏపీ సహ దేశం పురోగమిస్తుందని చెప్పారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల యోగక్షేమాలు, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అద్వితీయంగా పురోగమిస్తున్నదని వెల్లడించారు. సీఎం కేసీఆర్పై ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణను ఆపలేరని తేల్చిచెప్పారు. ఆంధ్రాప్రజలపై సీఎం కేసీఆర్కు దురుద్దేశం, కక్ష ఏమీ లేవని స్పష్టం చేశారు.
నంద్యాల, ప్రకాశం, కర్నూలు ప్రాంతాల నుంచి టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. కర్నూల్ కార్పొరేటర్ ముస్తాక్ (టీడీపీ), ప్రకాశం జిల్లా రామాపురం గ్రామ సర్పంచ్ సాయిజై సహ పలువురు ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు, సలీమ్ బేగ్, వెంకటేశ్వర్లు, యూసఫ్బేగ్, అనీష్ పాషా, ఎంఆర్పీఎస్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ సహ పలువురు బీఆర్ఎస్లో చేరారు.
ప్రజావ్యతిరేక మోదీ విధానాలను అడుగడుగునా ప్రశ్నించే దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వేముల స్పష్టం చేశారు. మోదీ పాలనను, దుర్మార్గ విధానాలను నిలదీస్తున్న వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు దాడులకు దిగుతున్నాయని మండిపడ్డారు. మోదీ విధానాలను ఎండగట్టినందుకే ఎమ్మెల్సీ కవితపై ఈడీ, సీబీఐ దాడులని, వాటికి తామేం భయపడబోమని తేల్చిచెప్పారు. దేశ ప్రజల పక్షాన నిలబడిన వారిని ఈడీలు, బోడీలు ఏం చేయలేవని స్పష్టం చేశారు.