హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ను రద్దుచేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ( ఏఐఎస్జీఈఎఫ్ ) పిలుపు మేరకు శుక్రవారం ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన చేతన్ర్యాలీలో జగదీశ్వర్ మాట్లాడుతూ.. కేంద్రం పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి, ఇప్పటివరకు జమ అయిన సొమ్మును రాష్ట్రాలకు ఇప్పించాలని కోరారు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, కామారెడ్డి అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సాయిలు, మెదక్ అధ్యక్షుడు నరేందర్, హనుమకొండ అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి సోమన్న, జనగామ జిల్లా అధ్యక్షుడు ఖాజాషరీఫ్, శ్రీనివాస్, నేతలు కొండల్రెడ్డి, నరసింహరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, పర్వతాలు, చారి, టీఎస్ యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావ రవి పాల్గొన్నారు.