హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తిరుమలలో సామాన్యులకు కేటాయించే గదుల అద్దెలు ఒక్క రూపాయికూడా పెంచలేదని, ధరలు పెంచామని విమర్శలు చేయడం సరికాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టంచేశారు. అద్దెగదుల ధరలపై గురువారం ఆయన స్పందించారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే కొందరు అద్దె గదుల ధరలపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలలో మొత్తం 7,500 గదులు ఉన్నాయని తెలిపారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల అద్దెలో 40 ఏండ్లుగా మార్పులేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక గదులను రూ.116 కోట్లతో ఆధునికీకరించిందని వెల్లడించారు. పద్మావతి, ఎంఏబీసీ ప్రాంతంలో ఉన్న గదులకు అద్దె ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇక్కడ సౌకర్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయని తెలిపారు. వీఐపీలు ఎక్కువగా ఈ గదుల్లో ఉంటారని పేర్కొన్నారు. నారాయణగిరి, ఎస్వీ గెస్ట్హౌజ్లోని 1,344 గదుల అద్దెలు మాత్రం పెంచామని స్పష్టం చేశారు. ఇక్కడి గదులను రూ.8 కోట్ల వ్యయంతో ఆధునికీకరించినట్టు చెప్పారు. అయినా టీటీడీ ఆదాయం కోసం ధరలు పెంచలేదని, ఏసీ గదులు ఏర్పాటు చేసి అన్ని గదులకు సమానంగా అద్దె ఉండాలని ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. ఒక్కొక్క గదికి రూ. 5 లక్షలు ఖర్చు చేశామని, పెరిగిన ధరల వల్ల టీటీడీకి నామమాత్రపు ఆదాయం మాత్రమే వస్తున్నదని పేర్కొన్నారు. టీటీడీపై వస్తున్న విమర్శలను ఖండిస్తున్నట్టు చెప్పారు.