వేల్పూర్, డిసెంబర్ 10 : రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవ.. స్నేహితుల సహకారంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్ సౌకర్యాలను సమకూర్చుకొంటున్నాయి. కరోనా కాలంలో సర్కారు దవాఖానలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన మంత్రి ప్రశాంత్రెడ్డి తన నియోజకవర్గంలో వాటి అభివృద్ధికి నడుం బిగించారు. గ్రామీణ వైద్యశాలల్లోనూ ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. ప్రభుత్వంపై భారం పడకుండా.. దాతల సహకారంతో గ్రామీణ వైద్యశాలల రూపురేఖలు మార్చాలనుకొన్నారు. తన ఆలోచనలను స్నేహితులతో పంచుకోగా.. ఈ బృహత్ కార్యానికి చేయూతనందించేందుకు ముందుకొచ్చారు. మిత్రులతోపాటు మంత్రి సతీమణి నీరజారెడ్డి సైతం రూ.25 లక్షలు అందజేశారు. అలా సేకరించిన రూ.1.5 కోట్ల విరాళాలతో బాల్కొండ నియోజకవర్గంలోని పీహెచ్సీల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటుచేశారు. రూ.31 లక్షల విరాళాలతో పునర్నిర్మించిన వేల్పూర్ పీహెచ్సీని మంత్రి ప్రశాంత్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
పేదలందరికీ మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వేముల తెలిపారు. వేల్పూర్ పీహెచ్సీలో తన మిత్రుల సహకారంతో 31 లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన 8 ఐసీయూ, 6 ఆక్సిజన్ బెడ్లను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖానలోనే ఐసీయూ బెడ్లు ఉండేవి కాదని, స్వరాష్ట్రంలో ఇప్పుడు పీహెచ్సీల్లోనూ అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ఇటీవల తన మిత్రుడొకరు 27 లక్షల విలువైన ఆక్సిజన్ అంబులెన్స్ను అందజేశారని వెల్లడించారు. భవిష్యత్తులో కరోనాలాంటి మహమ్మారులను ఎదుర్కోవాలంటే ప్రభుత్వ వైద్యవిభాగాలు బలంగా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని, ప్రభుత్వం ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి దంపతులను స్థానికులు సన్మానించారు.