మహబూబ్నగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా వైరస్ బారి నుంచి కాపాడుకోవడానికి రాబోయే మూడు వారాలు అత్యంత కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, పెద్దపెద్ద దావత్లకు దూరం గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. థర్డ్వేవ్ నుంచి ప్రజలను కాపాడుకొనేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నదని చెప్పారు. మంగళవారం ఆయన పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి మహబూబ్నగర్ జిల్లా బాలానగర్, కోయిలకొండలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ప్రారంభించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రెండు కోట్ల కరో నా టెస్టింగ్ పరికరాలు, కోటి హోం ఐసొలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఏఎన్ఎం, సబ్సెంటర్, పీహెచ్సీ, సీహెచ్సీ, జిల్లా, జనరల్ దవాఖానల్లో ఎక్కడైనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ఇచ్చే మందులు వారం రోజులు వాడితే కరోనా తగ్గిపోతుందని, ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని అన్నారు. ఇటీవల వ్యాక్సిన్ వేసేందుకు స్కూటీ మీద వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎన్ఎం కుటుంబసభ్యులకు త్వరలోనే రూ.50 లక్షల బీమా చెక్కును అందజేస్తామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినప్పటికీ, తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 17 వైద్య కళాశాలలు మంజూరుచేశారని, ఈ విద్యా సంవత్సరంలో 8 కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పారు. జాతీయ రహదారిపై ఉన్న బాలానగర్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
317 జీవోను రద్దు చేయాలని కోరుతున్న బీజేపీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకొంటున్నదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ జీ వో అమలు ద్వారా రాష్ట్రంలో మిగిలిపోయిన ఖాళీల్లో 95 పోస్టులను స్థానికులతోనే భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. త్వరలోనే 60 వేల నుంచి 70 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10.62 లక్షల ఉ ద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తుందని చెప్పారు. మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లలా తయారవుతాయని పేర్కొన్నారు.
కోర్టు కేసులతోనే ‘పాలమూరు’ పనుల్లో ఆలస్యం: మంత్రి శ్రీనివాస్గౌడ్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే.. ఓర్వలేని కొందరు నాయకులు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగేలా చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. కొందరు ప్రతిపక్ష నేతల వల్లే పనులు ఆగిపోయాయని.. లేకుంటే ఈ పాటికే చెరువుల్లోకి నీళ్లు వచ్చేవని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి సాగునీటిని ఆంధ్రాప్రాంతానికి తరలిస్తుంటే కొంతమంది నాయకులు హారతులు పట్టారని ఎద్దేవా చేశారు. త్వరలోనే మహబూబ్నగర్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన పనులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, సంగీత, నాటక రంగ అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, డీఎంఈ రమేశ్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నందలాల్ పవార్, జిల్లా వైద్యాధికారి కృష్ణ పాల్గొన్నారు.