హైదరాబాద్ : నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95శాతం పూర్తయ్యాయని, మూడు నెలల్లో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ మహేందర్రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంలోని అన్ని టవర్లను, డేటా సెంటర్లను, హెలీపాడ్ను సందర్శించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. పోలీస్శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు సమావేశమై విపత్కర పరిస్థితులు ఎదురైన సమయంలో పరిష్కరించేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తుంటారనీ, ఇందుకు అనుగుణంగానే నిధులు కేటాయిస్తున్నారన్నారు.
అలాగే పోలీసు నియామకాలను భారీ స్థాయిలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 8లక్షలకుపైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నేరాలను అరికట్టేందుకు వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ సెంటర్ ద్వారా ఒకేసారి లక్షకిపైగా సీసీ కెమెరాలను చూసే అవకాశం ఉంటుందని ఈ బిల్డింగ్లో మొత్తం ఐదు టవర్స్ ఉన్నాయన్నారు.
ఈ సెంటర్లో మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నామని వీటిని విద్యార్థులు, ఔత్సాహికులు సందర్శించవచ్చని డీజీపీ పేర్కొన్నారు. సీపీ సీవీ ఆనంద్ భవన నిర్మాణ పనులపై వివరించారు. పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రజా సహకారం అవసరమని పేర్కొన్నారు. నేరాలను అరికట్టేందుకు ,రాష్ట్ర అభివృద్ధికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అడిషనల్ డీజీపీ జితేందర్, ఈఎన్సీ సి గణపతి రెడ్డి, డీసీపీలు జోయల్ డేవిస్, సునీత రెడ్డి, షాపూర్జీ ప్రతినిధి లక్ష్మణ్ ఉన్నారు.