మెట్పల్లి రూరల్/చందుర్తి/తిమ్మాపూర్, ఫిబ్రవరి 29: కరీంనగర్ జిల్లా పరిధిలోని ముగ్గురు అభ్యర్థులు.. ఇటీవల వెల్లడించిన గురుకుల పరీక్షల ఫలితాల్లో ప్రతిభ ప్రదర్శించారు. ఒకేసారి రెండు చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యి సత్తా చాటారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సత్తక్కపల్లికి చెందిన కొత్తపల్లి (కొడిమ్యాల) పావని గురుకుల జేఎల్,పీజీటీ పరీక్షలు రాసింది.
గురువారం జూనియర్ లెక్చరర్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా.. మ్యాథమెటిక్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 139వ ర్యాంకు, పీజీటీ పోస్టుకు 41వ ర్యాంకు సాధించింది. పావనిని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కుమార్ అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన అంచ వనజ (అర్చన) గురుకుల జేఎల్, పీజీటీ పోస్టులకు ఎంపికైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానికి చెందిన జినుక శ్రీనివాస్ గురుకుల పీజీటీ ఇంగ్లిష్, జేఎల్ ఫలితాల్లో సత్తాచాటి రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. వీరిని స్థానికులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.