నల్లగొండ : జిల్లా ప్రభుత్వ కేంద్ర దవాఖానలో ఎలాంటి షార్ట్ సర్క్యూట్, సిలిండర్ పేలడం జరగలేదని జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ స్పష్టం చేశారు. జిల్లా ప్రభుత్వ కేంద్ర దవాఖాన మాతా శిశు కేంద్రం సబ్ స్టోర్ రూంలో సోమవారం ఉదయం7.30 గంటలకు పొగ వ్యాపించిన సంఘటనపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. హాస్పిటల్ సూపరిండెంట్తో మాట్లాడి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
దవాఖానను సందర్శించి మాతా శిశు కేంద్రం సబ్ స్టో ర్ రూంను పరిశీలించారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగ లేదని, దవాఖాన, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి కిటికీలను పగల గొట్టి పొగ బయటికి పంపించి ఫైర్ ఎక్స్టెన్షన్తో పొగలు ఆర్పి వేసారని చెప్పారు. బాత్రూం క్లీన్ చేసే సల్ప్యూరిక్ ఆసిడ్ 5 ఎం.ఎల్.. మగ్గులో ఉండగా ఆ ద్రావణం బ్లీచింగ్ పౌడర్తో కలిసి పొగ రావటం ప్రధాన కారణమని వివరించారు.
మాతా శిశు కేంద్రం ఓ.పి.లో పెద్ద ఎత్తున మహిళలు క్యూ లైన్లో ఉండటంతో అదనంగా రెండు, మూడు ఓ.పి.కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్, తదితరులు ఉన్నారు.