హుజురాబాద్ :దళితుల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట లో సోమవారం దళిత బంధు సర్వే తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా పనిచేస్తుందన్నారు.
ఆదాయం వచ్చే యూనిట్లను ఎంపిక చేసుకోవాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు. అనంతరం ఇల్లందకుంటలోని పాత ఎస్సీ కాలనీ లోని దళిత కుటుంబాలతో కలెక్టర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వారు ప్రారంభించే యూనిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళిత కుటుంబంతో కలిసి చాపపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్ పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, హుజరాబాద్ ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఇల్లందకుంట తాసిల్దార్ సురేఖ తదితరులు పాల్గొన్నారు.