Sircilla | సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి 12: వారిది నేతకార్మిక కుటుంబం. తల్లిదండ్రులు రోజంతా పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. పనిచేయడం ఒక ఎత్తు అయితే పవర్లూంపై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్ చేయడం మరో ఎత్తు. ఈ క్రమంలో అమ్మానాన్న కష్టాన్ని కండ్లారా చూసిన కొడుకు చలించిపోయాడు.
ఈ బాధలు తన తల్లికే కాదు మరెవరికీ రావొద్దని భావించాడు. చదువుతున్నది పదోతరగతే అయినా రెండు నెలలు కష్టపడి అద్భుతాన్నే ఆవిష్కరించాడు సిరిసిల్ల పట్టణం గణేశ్ నగర్కు చెందిన జక్కని హేమంత్. తనలోని సృజనాత్మకతకు పదును పెట్టి టీచర్ల సాయంతో కేవలం రూ.2 వేల వ్యయంతో ఓ యంత్రాన్ని ఆవిష్కరించి పలువురు ప్రశంసలు అందుకుంటున్నాడు. సోమవారం కలెక్టర్ అనురాగ్ జయంతి సైతం అభినందించారు.
రెండు నెలల కష్టానికి ఫలితం
సిరిసిల్ల పట్టణం గణేశ్నగర్కు చెందిన జక్కని జ్ఞానేశ్వర్, రూప దంపతులు. వీరిది పేద కుటుంబం. నేత కార్మిక వృత్తే వీరి జీవనాధారం. పవర్లూంపై నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరికి పూనం, హేమంత్, కీర్తి సంతానం. హేమంత్ రెండో వాడు. హేమంత్ సిరిసిల్ల శివనగర్లోని కుసుమ రామయ్య బాలుర హైస్కూల్లో పదోతరగతి చదువుతున్నాడు.
తల్లిదండ్రులు పవర్లూంపై ఉత్పత్తి చేసిన బట్ట మడతపెట్టేందుకు ఇబ్బందులు పడుతుండటం, కాళ్లు, నడుం నొప్పులతో బాధపడటం బాల్యం నుంచే చూశాడు. అంతలోనే కరోనా రావడం, తండ్రి మృతిచెందడంతో కుంగిపోయాడు. తాను అనుకున్నది చేయాలని అనుకున్నాడు.
తన ఆలోచనను ఉపాధ్యాయులతో చెప్పాడు. వారి సలహాలు, సూచనల మేరకు దాదాపు రెండు నెలలపాటు కష్టపడి రూ.2 వేల వ్యయంతో చిన్న మోటర్, సెన్సర్, చక్రాలు, చైన్ సాయంతో పవర్లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మెషిన్ను తయారు చేశాడు. ఇన్నిరోజులు బట్టలు మడతపెట్టేందుకు తన తల్లికి గంటకుపైగా సమయం పట్టగా, ఈ యంత్రంతో కేవలం 10 నిమిషాల్లోనే పని పూర్తవుతున్నదని హేమంత్ చెప్పాడు.
కలెక్టర్ అభినందన..
హేమంత్ సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ఈ యంత్రాన్ని ప్రదర్శనకు ఉంచారు. కలెక్టర్ అనురాగ్జయంతి పరిశీలించి, దాని వినియోగం గురించి తెలుసుకొని విద్యార్థిని అభినందించారు. హేమంత్ను, ఎగ్జిబిట్ గైడ్ టీచర్ పాకాల శంకర్గౌడ్ను టీవర్క్స్ తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని డీఈవో రమేశ్కుమార్ను కలెక్టర్ ఆదేశించారు.