హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, అప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో మలేరియా, డెంగీ, టెస్టింగ్ కిట్లతోపాటు కొవిడ్ పరీక్షల కోసం ర్యాపిడ్ కిట్లను, జిల్లా దవాఖానల్లో ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయని, ఆయనకు ఇంకా వ్యాధి నిర్ధారణ కాలేదని తెలిపారు. డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులను నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలు, సంసిద్ధత, కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ తదితర అంశాలపై రాష్ట్ర మంత్రుల బృందం సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు,సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో సీజనల్ జ్వరాలు చాలావరకు తగ్గాయన్నారు.
డెంగ్యూ చికిత్సకు సకల ఏర్పాట్లు
ఈసారి వరదల వల్ల నీరు కలుషితమై హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గత ఆరేండ్లలో మలేరియాను గణనీయంగా తగ్గించామని, ఈసారి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొన్ని కేసులు కనిపిస్తున్నాయని చెప్పారు. డెంగ్యూ చికిత్సకు అన్ని ప్రధాన దవాఖానల్లో ఎస్డీపీ యంత్రాలు, బ్లడ్ సెపరేటర్లు, ప్రత్యేక వార్డులు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. దోమల నివారణకు పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలు కలిసి పనిచేస్తాయని, ఫ్రైడే-డ్రైడేతోపాటు యాంటీ లార్వా చర్యలు చేపట్టామని వివరించారు.
విద్యార్థులతో కలిసి కలెక్టర్ల భోజనం
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో భోజనం నాణ్యంగా ఉం డేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి హరీశ్రావు తెలిపారు. కలెక్టర్లు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. స్కూళ్లలో ఎక్కడైనా పాత బియ్యం ఉంటే వెంటనే మార్చాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. హాస్టళ్లను తనిఖీచేసి కలెక్టర్లకు నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించినట్టు చెప్పారు.
బూస్టర్కు నెల టార్గెట్
బూస్టర్ డోస్ పంపిణీని వేగవంతం చేసి నెల రోజుల్లోగా పూర్తిచేసేలా అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్టు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. రాష్ట్రంలో రెండు కోట్లకుపైగా బూస్టర్ డోస్లు వేయాల్సి ఉన్నదన్నారు. రెండో డోస్ వేసుకొని 6 నెలలు దాటినవారిలో ప్రతిరక్షకాల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నందున అందరూ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మంకీపాక్స్పై ఆందోళన వద్దు
మంకీపాక్స్పై ఎవరూ భయపడాల్సినక్కర్లేదని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఎవరికైనా జ్వరం, దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాని సూచించారు. విదేశాల నుంచి, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్పోర్టుల్లోనే పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. సమీక్షలో సీఎస్ సోమేశ్కుమార్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఎస్సీ డెవలప్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, సీడీఎంఏ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, డీపీహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్వేతా మహంతి, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
నివారణ మన చేతుల్లోనే..
డెంగ్యూ నివారణ ప్రజల చేతుల్లోనే ఉన్నదని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రతి ఆదివారం ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న మంచి నీటిని పారబోసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తామని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోనివారు కాచి, చల్లార్చిన నీటినే తాగాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల బారినపడినవారు ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వైద్యం పొందాలని కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అంటువ్యాధుల నివారణకు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్వేతామహంతిని ప్రత్యేక అధికారిగా నియమించినట్టు ప్రకటించారు.