Cold Wave | హైదరాబాద్ : తెలంగాణలో చలి వణికిస్తోంది. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలి తీవ్రత ప్రారంభమైంది. గత వారం రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్, చాలా ప్రాంతాల్లో 12 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, రాజన్నసిరిసిల్లలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీలో అత్యంత కనిష్టంగా 8.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 8.2 నుంచి 15.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ నవంబర్లో గతం కంటే ఎక్కువ చలి తీవ్రత ఉంటుందని తెలిపింది.
హైదరాబాద్ నగరంలో శుక్రవారం కొన్ని చోట్ల 10-11 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. సుమారు 7-10 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.