హైదరాబాద్, జనవరి23 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం 8 గంటల సమయంలోనూ దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓ వైపు చలిగాలులు, మరోవైపు పొగమంచు ఉండటంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పొగమంచు కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లి వాగులోకి కారు దూసుకెళ్లింది.
అదృష్టవశాత్తూ అందులో ఉన్నవారికి ఏమి కాలేదు. హైదరాబాద్ శివారులోని పటాన్చెరులో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ 10 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.