హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పతనమవుతున్నాయి. సాధారణంకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. సాయంత్రం నుంచి ఉదయం వరకు మంచుదుప్పటి కప్పేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాలు పొగమంచులోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో అతితక్కువగా కుమ్రం భీం జిల్లాలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్లో 9.6 డిగ్రీలు, మంచిర్యాలలో 10.1 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 11 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరుకున్నాయి. సిద్దిపేట జిల్లా దుల్మిట్టలో 10.9 డిగ్రీలు, మెదక్ జిల్లా నార్లపల్లిలో 13 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా నల్లవల్లిలో 13.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.