హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను బొగ్గు కొరత సమస్య వేధిస్తున్నది. రానున్నది వర్షాకాలం కావడంతో భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రంకానున్నది. ఈ నేపథ్యంలో టీజీ జెన్కో, సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం జెన్కో సీఎండీ హరీశ్ నేతృత్వంలోని అధికారుల బృందం, సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతితో భేటీ అయ్యింది. థర్మల్ప్లాంట్లకు సరిపడా బొగ్గు సరఫరాపై వారు చర్చించారు.
యాదాద్రి సహా అన్ని ప్లాంట్లల్లో విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగకుండా సరఫరా చేయాలని జెన్కో అధికారులు సింగరేణి అధికారులను కోరారు. సింగరేణి థర్మల్ప్లాంట్లకు ఏడాదికి 28 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేస్తున్నది. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో 93% ఓపెన్కాస్టుల నుంచే వస్తున్నదని, భారీ వర్షాల సమయంలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకమేర్పడుతున్నదని సింగరేణి సీఎండీ అధికారులకు వివరించారు. రోజుకు 60-70 వేల టన్నుల బొగ్గును జెన్కోకు సరఫరా చేస్తున్నట్టు వివరించారు. బొగ్గు నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులను సింగరేణి సీఎండీ ఆదేశించారు.
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం సివిల్ సైప్లె కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులతోపాటు సివిల్ సైప్లె మిల్లింగ్, ట్రాన్స్పోర్టు, డ్రై ఏజ్, కస్టోడియన్ చార్జీలను చెల్లించాలని కోరారు. దీంతోపాటు పాత గన్నీ ధరను రూ.11గా నిర్ణయించాలని విన్నవించారు. 25% పెనాల్టీని మాఫీ చేసి, వడ్డీరేటు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. డిఫాల్ట్ మిల్లర్లకు ష్యూరిటీ పెట్టిన మిల్లర్లకు బిల్లులకు సంబంధించిన చెక్కులను ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి, కార్యదర్శి ఊట్కూరి వీరేశం, కోశాధికారి విశ్వనాథం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.