BRS | హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): పర్యావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా ఉండాలంటే పంటకాలంలో మార్పు లు రావాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. రాష్ట్రం లో రైతులను కంటికి రెప్పలా కాపాడుకొంటున్నామని చెప్పారు. ‘దేశంలో ఎవరూ చేయని సాహసం మనం చేసినం. ఇటీవల అకాల వ ర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రం పట్టించుకోకపోయినా మనం ఆదుకొన్నం. రెండుమూడు వేల కోట్ల రూపాయల భారమైనా ఆదుకుంటామని ప్రకటించాం. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని చెప్పినం.. ఇస్తున్నం. ఇది చరిత్ర. దేశం లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని పని ఇది. దీన్ని మనం ఘనంగా చెప్పుకోవాలి’ అని పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. వడగండ్లవాన, అకాల వర్షాల నుంచి రైతులను శాశ్వతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘పంట కాలాన్ని ముందుకు జరుపాలి. మార్చి 31 లోపల వరికోతలు పూర్తయ్యేలా పంట వేసుకోవాలని రైతులకు ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు విడమర్చి చెప్పాలి. మార్చి 31లోపల వరి పంట చేతికొస్తే మిల్లింగ్ సమయంలో నూక రాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. పంట కాలాన్ని క్రమంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తున్నది. ఎమ్మెల్యేలు రైతులను చైతన్యం చేసే బాధ్యత తీసుకోవాలి’ అని చెప్పారు.
అవసరమైతే ప్రత్యేక జడ్పీ సమావేశాలు
పంట కాలం మార్పు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు అర్ధమయ్యేలా చెప్పాలని సీఎం కేసీఆర్ సూచించారు. అవసరమైతే ప్ర త్యేక జడ్పీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ‘మిషన్ కాకతీయతో భూగర్భ జ లాలు అద్భుతంగా పెరిగాయి. ఒక్కో గొలుసుకట్టు చెరువు 27, 28 చెరువుల కింద రైతులకు బువ్వపెట్టింది. మిషన్ కాకతీయ లేనప్పుడు ఇప్పుడెంత భూగర్భ జలం వచ్చిందో రైతులకు వివరించాలి. రాష్ట్రంలోని 30 లక్షల బోర్లకు కొదవలేని నీరు అందుబాటులో ఉన్న ది. రైతు అనుకూల విధానాల వల్ల పంట దిగుబడిలో మనం పంజాబ్కు సమం అయ్యాం. యాసంగిలో 56 లక్షల 44 వేల ఎకరాల్లో నా ట్లు పడ్డాయి. రైతుల పట్ల మనకు ఉన్న కమిట్మెంట్ను ప్రచారం చేయాలి’. అని చెప్పారు.
రైతు వేదికలే కేంద్రాలు
రైతు వేదికలు అపూర్వమైనవని సీఎం కేసీఆర్ చెప్పారు.‘రైతు వేదిక ఆవశ్యకత, దాని వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు రైతులను పిలిచి భోజనాలు పె ట్టాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు ఇలా అందరూ రైతు వేదికల దగ్గరికి వెళ్లి రైతులతో చర్చించాలి’ అని ఆదేశించారు.
కల్తీలపై ఉక్కుపాదం
రైతులకు నష్టం కలిగించే ఏ చర్యనైనా ప్రభు త్వం సీరియస్గా తీసుకొంటుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో కల్తీ విత్తనాలు అమ్మితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటుందనే జంకు రావాలనే కల్తీ విత్తనాల అమ్మకందారులపై పీడీ యాక్టు కింద కేసులు పెడుతున్నామని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణను సువర్ణావకాశంగా తీసుకోవాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. గోరటి వెంకన్న తన పాటతో మారిన తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ ముఖానికి ప్రతిబింబం సీఎం కేసీఆర్ అని తనదైన శైలిలో ఆవిష్కరించారు. ఉత్సవాలను తెలంగాణ జీవకళ ఉట్టిపడేలా నిర్వహించాలని సూచించారు.