హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పొరపాటున నిషేధిత జాబితాలో పడిన భూముల కు సంబంధించిన దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించిం ది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కలెక్టర్ లాగిన్లో ప్రత్యేక మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని వేలాది ఎకరాల పట్టా భూములు వివిధ కారణాల వల్ల నిషేధిత జాబితాలో చేరాయి. వీటిలో స్వాతంత్య్ర సమరయోధులు, సైనికులకు ఇచ్చిన భూములు కూడా ఉన్నా యి. ఇలాంటి భూములను ఆ జాబితా నుంచి తొలిగించేలా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గతంలోనే ధరణి పోర్టల్లో అవకాశమిచ్చింది. సిటిజన్ లాగిన్లోని ‘గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్’ పేరుతో టీఎం-15 మాడ్యూల్ను అందుబాటులోకి తెచ్చిం ది. దీని ద్వారా అన్ని జిల్లాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వీటిని కలెక్టర్లు పరిశీలించిన తర్వాత తాసిల్దార్ల ద్వారా నివేదికలు తెప్పించుకొని పరిష్కరించాల్సి ఉన్నది. అయితే సూర్యాపేట మినహా ఇతర ఏ జిల్లాలోనూ ఈ దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టిపెట్టలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎంవో కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సీఐజీ శేషాద్రి శనివారం కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లోగా దరఖాస్తులు క్లియర్ చేయాలని స్పష్టం చేశారు.