CM Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 18 మంది రైతులు మాత్రమే చనిపోయారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రైతుబీమాకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ప్రకారం ఈ లెక్క తేలిందని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయిన రైతులకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన జాబితాపై అధికారులను ఆయా రైతుల ఇండ్లకు పంపించి విచారణ జరిపించామని వెల్లడించారు. వాళ్లంతా వివిధ కారణాలతో చనిపోయినట్టు తేలిందని పేర్కొన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబం కచ్చితంగా రైతుబీమాకు దరఖాస్తు చేసుకుంటుందని, ఇప్పటివరకు 18 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.
రాష్ట్రంలో నీటి సమస్య ఉన్నదని, ప్రభుత్వం దీనిని అధిగమించి నీటి సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నదని రేవంత్రెడ్డి తెలిపారు. ‘నా ఇంట్లోనూ బోరు ఎండిపోయింది. మాకు నీళ్లు సరిపోతలేవు. భూగర్భ జలాలు పడిపోవడంతో అన్ని బోర్లు ఎండిపోయాయి. కాబట్టి నీళ్ల కొరత ఏర్పడింది’ అని వివరించారు. గత సంవత్సరంతో పోల్చితే నీటి సరఫరా 140% పెరిగిందని చెప్పారు. తనకు కేసీఆర్ కరువును వారసత్వంగా ఇచ్చారని పేర్కొన్నారు. కరువు పరిస్థితులను ముందే గుర్తించి, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోజువారీగా ఎన్ని నీళ్లు అవసరమవుతున్నాయో లెక్కగట్టి జూలై నెల వరకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్తు కొరత లేదని స్పష్టం చేశారు. పంటలు కోతకు రావడంతో పవర్ క్రైసిస్ జీరో అని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్తు సమస్య ఏర్పడితే, అది పవర్ ఇంటరప్షన్ మాత్రమేనని, పవర్ కట్ కాదని చెప్పారు.
మళ్లీ జిల్లాల పునర్విభజనకు సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి స్పందిస్తూ… ‘జిల్లాల పునర్విభజన చేస్తామని అసెంబ్లీలోనే చెప్పినం. ఇందుకోసం జ్యుడీషియల్ కమిషన్ వేస్తాం. ఆ కమిషన్ విచారణ జరిపి రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉండాలి? ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉండాలి? ఎన్ని జిల్లాలు ఉండాలి? అనే అంశాన్ని తేల్చుతుంది. ఒక క్రమ పద్ధతిలో మళ్లీ విభజన చేస్తాం’ అని స్పష్టం చేశారు.
ఆరెస్సెస్ ఎజెండా ప్రకారం భారత్ను హిందూ దేశంగా మార్చేందుకు, రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్షా కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. దేశం ప్రమాదకర స్థితిలో ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. 1925లో ఏర్పాటైన ఆరెస్సెస్.. ఈ దేశాన్ని వందేండ్లలో పూర్తి హిందూ దేశంగా, రిజర్వేషన్లు లేని దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నదని, 2025తో ఆ గడువు ముగుస్తున్నదని తెలిపారు. అందుకే ఆరెస్సెస్ ఎజెండాను పూర్తి చేసేందుకు మోదీ, షా కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు కావాలంటూ డ్రామా అడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవేళ వారు అనుకుంటున్నట్టు సీట్లు వస్తే, దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తారని హెచ్చరించారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు ఉండాలనుకునే వాళ్లు కాంగ్రెస్కు ఓటేయాలని, వద్దనుకునే వాళ్లు బీజేపీకి ఓటేయాలని సూచించారు. చదువుకున్నవారు, విజ్ఞులు, కామన్సెన్స్ ఉన్నచోట బీజేపీ పాచికలు పారవని, సెంటిమెంట్ ఉన్నచోట మాత్రమే బీజేపీ పాచికలు పారుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆస్తులు లాగేసుకుంటుందంటూ ప్రధాని మోదీ, అమిత్షా చేస్తున్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ప్రతి ఒక్కరి ఆస్తికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని, సదరు వ్యక్తి ఆమోదం లేకుండా ఒకరి ఆస్తిని మరొకరు తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. మోదీకి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే ఇలాంటి చీప్ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా సీపీఎం నేతలను కోరామని రేవంత్రెడ్డి వెల్లడించారు. సీపీఎం రాష్ట్ర ముఖ్య నేతలు శనివారం సీఎంను కలువగా భువనగిరితోపాటు అన్ని స్థానాల్లో సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులను కోరామని తెలిపారు. బీజేపీని ఓడించేందుకు, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేందుకు సీపీఎం నాయకులు అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో సీపీఎం సహకారంతో ముందుకెళ్తామని చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలిపామని, వారిని విరమించుకోవాలని తమను సీఎం కోరినట్టు సీపీఎం నేతలు తెలిపారు. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.