హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల రంగం, ప్రాజెక్టులపై ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. ఇప్పటికే ఆలోచన లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లతోపాటు ఔట్లెట్లను కేంద్రానికి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు అంగీకరించింది. అటు తరువాత ప్రతిపక్ష పార్టీల ఒత్తిడితో దిగొచ్చింది. అయితే, అసెంబ్లీ వేదికగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను అప్పగించబోమని బీరాలు పలికినా, ఆచరణలో మాత్రం సీరియస్గా తీసుకున్న దాఖలాలు కనిపించటంలేదు. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై కేంద్ర జల్శక్తిశాఖ శుక్రవారం నిర్వహించ తలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడమే అందుకు నిదర్శనం. ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉన్నదనే సాకుతో సమావేశం వాయిదా కోరిన రాష్ట్ర సర్కారు, ఇటు అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయకుండా తప్పించుకొన్నది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి నెలరోజుల్లోగా అప్పగించాలని జనవరి 17వ తేదీన నిర్వహించిన సమావేశంలో ఇరు రాష్ర్టాలకు కేంద్ర జల్శక్తిశాఖ స్పష్టంగా చెప్పింది. దీనిపై కేఆర్ఎంబీలో చర్చించుకుని ప్రాజెక్టుల అప్పగింత, నిర్వహణకు యాక్షన్ ప్లాన్తో రావాలని నిర్దేశించింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం తలూపింది. ఈ నెల 1వ తేదీన కేఆర్ఎంబీ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కూడా ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అంగీకారం తెలిపింది.
ఈసారి మరో అడుగు ముందుకేసి ప్రాజెక్టుల నిర్వహణకు అధికారులను కూడా అప్పగించేందుకు ఒప్పుకున్నది. అయితే ప్రాజెక్టుల అప్పగింత వల్ల రాష్ర్టానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడ్డది. దీంతో ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. కాగా, ప్రాజెక్టుల అప్పగింత అంశంపై తదుపరి సమావేశాన్ని 16వ తేదీన నిర్వహిస్తామని కేంద్ర జల్శక్తిశాఖ గతంలోనే వెల్లడించింది. రాష్ట్ర సర్కారుకు సమాచారం అందించింది. ఈ సమావేశానికి కచ్చితంగా హాజరవుతామని, ప్రాజెక్టుల అప్పగింత అంశంపై తెలంగాణ రాష్ట్ర అభిప్రాయాలను, అభ్యంతరాలను కరాఖండిగా తేల్చిచెప్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితోకలిసి సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించారు. తీరా ఆ సమావేశం రోజున ప్రభుత్వం డుమ్మా కొట్టింది. అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉన్నదని, అందువల్ల సమావేశాన్ని మరో తేదీకి వాయిదా వేయాలని జల్శక్తిశాఖకు లేఖ రాసింది. ఇటు అసెంబ్లీలో శ్వేతపత్రం కూడా విడుదల చేయలేదు.
ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతుంటే కేంద్రం నిర్వహించిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ హాజరుకాకుండా కావాలనే వాయిదా కోరారని, రాష్ర్టానికి ప్రాణసంకటమైన అంశాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్రెడ్డి పదేపదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగానూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమిటని ఇంజినీర్లు, తెలంగాణవాదులు నిలదీస్తున్నారు. ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జలహక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లుతుందనేది సత్యం. అంతటి ప్రాధాన్యమున్న అంశంపై కేంద్రం నిర్వహించే సమావేశానికి హాజరై ప్రాజెక్టుల అప్పగించబోమని స్పష్టంగా చెప్పాల్సి ఉన్నా, సమావేశానికి ముఖం చాటేయటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.