మహబూబ్నగర్ : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేని శ్రద్ద ఆంధ్రా ( Andhra ) కు లాభం చేయాలన్నదే సీఎం రేవంత్ ( CM Revanth ) లక్ష్యంగా కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ ,డాక్టర్ సి.లక్ష్మారెడ్డిలతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్న ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పాదయాత్రకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో సీఎం హడావుడిగా ప్రాజెక్టులను సందర్శించారని పేర్కొన్నారు. ఆయన పర్యటనలో ప్రాజెక్టుల పూర్తికి తీసుకోవలసిన చర్యలపై కాకుండా మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. గడిచిన రెండేళ్లల్లో సమయాన్నివృధా చేసిన తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రాజెక్టులపై అవగాహన, స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
అబద్ధపు పునాదుల మీద ఏర్పాటైన ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఐదు రిజర్వాయర్ల కోసం 27వేల ఎకరాలు భూసేకరణ జరిగిందని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని 14లో 12 సీట్లు గెలిపిస్తే జిల్లాకు ఒరిగింది ఏమీ లేదని వెల్లడించారు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా సాగు ఎట్లా పెరిగిందని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల నుంచి ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.
జూరాల సోర్స్ తో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు ఎట్లా అందుతాయో చెప్పలేదని ఆరోపించారు. ఆంధ్రా, కర్ణాటకకు మేలు చేసేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు జిల్లా మీద ప్రేమ ఉంది కాబట్టే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టారని, కేసులు వేయక పోతే తమ హయాంలోనే మొత్తం పూర్తి చేసే వాళ్లమని తెలిపారు. విలేకరుల సమావేశంలో చిట్టెం రామ్మోహన్ రెడ్డి ,అంజయ్య యాదవ్ , మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి , మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్ ,ఇంతియాజ్ పాల్గొన్నారు.