200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తుంటే.. రేవంత్రెడ్డి మాత్రం వారి అడ్రస్సులు చెప్పండి, విచారణ చేసి ఎన్నికల తర్వాత ఆదుకుంటామని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటూ హామీలిచ్చింది. ఇది గ్యారెంటీల ప్రభుత్వం కాదు.. గారడీల ప్రభుత్వం.
-బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 7: కాంగ్రెస్ ప్రజా పాలనను వదిలి ప్రతీకార పాలనను కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన జనజాతర సభలో ‘జైలులో పెడుతాం.. అక్కడే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాం’ అని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? అని ప్రశ్నించారు. తాము ప్రజల సమస్యలపై నిలదీస్తుంటే వారు మాత్రం జైలు, కేసులు అంటూ ప్రతీకారం తీర్చుకునేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు.. తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. శవాలు, శివాలు అని మాట్లాడే విధ్వంసకారులను పార్లమెంట్కు పంపిస్తే రాజ్యాంగం భద్రంగా ఉంటుందా? అని ప్రశ్నించారు.
నిత్యం ప్రజల అభ్యున్నతి కోసం, జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే వారిని పార్లమెంట్కు పంపించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్లోని దాసరి గార్డెన్లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి యుద్ధభేరి సదస్సులో ఆయన మాట్లాడారు. ఇది పదేండ్ల కేసీఆర్ అభివృద్ధి పాలనకు, వంద రోజుల అబద్ధాల కాంగ్రెస్ పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నికల పోరు అని ఆయన పేర్కొన్నారు. 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తుంటే.. రేవంత్రెడ్డి మాత్రం వారి అడ్రస్సులు చెప్పండి, విచారణ చేసి ఎన్నికల తర్వాత ఆదుకుంటామని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటూ హామీలిచ్చిందని, కానీ అది గ్యారెంటీల ప్రభుత్వం కాదని, గారడీల ప్రభుత్వమని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపిస్తే పిల్లల భవిష్యత్తు అభివృద్ధి వైపుగా సాగుతుందని తెలిపారు.
ఈ ఎన్నికల్లో తనను ఎంపీగా గెలిపిస్తే వచ్చే ఐదేండ్లు తెలంగాణ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే పని చేస్తానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్కుమార్ సూచించారు. బీఆర్ఎస్ ఏది చెప్పిందో? అది చేసి చూపించిందని అన్నారు. రైతులకు 24 గంటలు కరెంటు, సాగునీరు అందిస్తామని చెప్పి.. అమలు చేసి చూపించినట్టు తెలిపారు. తనను మళ్లీ గెలిస్తే తప్పకుండా నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, నాయకులు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.