CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తులోనూ మోదీ ఆశీస్సులు కావాలని బహిరంగంగా అడిగి.. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాదని పరోక్షంగా అంగీకరించి.. రెండురోజులపాటు మోదీ చేతిలో చెయ్యేసి.. తప్పుపట్టిన గుజరాత్ మాడల్ను తానే నోరారా పొగిడి.. ఆయనతో కదం కదం కలిపి, చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చిన కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి అకస్మాత్తుగా గొంతు మార్చారు. పాలమూరు సభలో తెచ్చిపెట్టుకున్న స్వరంతో ఆవేశంతో బీజేపీపై దాడి చేశారు. గంటల్లోనే ఆయనలో ఇంతమార్పుకు కారణం సుస్పష్టం. బీజేపీతో రేవంత్ బంధం బట్టబయలై, ఆ అక్రమ సంబంధాన్ని బీఆర్ఎస్ ఎండగట్టడంతో ‘గుమ్మడి కాయల దొంగ అంటే.. భుజాలు తడుముకున్నట్టు’ ఉలికిపడి పాలమూరు సభలో గాయి గాయి చేశారు. బీజేపీపై ఉత్తుత్తి ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మోదీతో తన సఖ్యతపై ఇంటాబయటా విమర్శలు వస్తున్న వేళ.. వాటి నుంచి బయటపడేందుకు విఫలయత్నం చేశారు. పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పాలమూరులో నిర్వహించిన ప్రజాదీవన బహిరంగ సభ పక్కదారి పట్టింది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి రాసుకుపూసుకు తిరగడంపై ఇంటా (కాంగ్రెస్), బయట (ప్రజల్లో) విమర్శలు వెల్లువెత్తడంతో దాని నుంచి బయటపడేందుకు ఈ సభను వేదికగా మార్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ప్రజలకు వివరించకుండా, మోదీని తాను ఎందుకు కలిశానో వివరణ ఇవ్వడానికే రేవంత్రెడ్డి ప్రయత్నించారు. రాష్ర్టానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేమిటని తనను తాను సమర్థించుకోవడానికే ఎక్కువగా ప్రయాసపడ్డారు. రాష్ర్టాభివృద్ధికి, ప్రాజెక్టులకు నిధులు అడిగాం.. ఇవ్వనిపక్షంలో చాకిరేవు పెడుతానని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు తిరిగి కేంద్రం వైఖరిని ఎండగడుతానంటూ మొక్కుబడిగా ఒక హెచ్చరిక చేసి అటు పార్టీ నాయకత్వాన్ని, ఇటు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ పెద్దల కన్నెర్రతోనే..
ప్రధాని మోదీని పెద్దన్నగా సంభోదించడం, మీ సహాయ సహకారాలు, మీ ఆశీస్సులు మాకు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా సాగిలబడినట్టుగా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఇది కాంగ్రెస్ పెద్దలకు రుచించకపోగా, వివరణ కూడా అడిగినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు రాష్ట్రంలో రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కేంద్రంతో, ముఖ్యంగా ప్రధాని మోదీతో నెరుపుతున్న బంధాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజల ముందుంచింది. దీనిని నుంచి బయటపడటానికి ప్రజాదీవన సభా వేదికపై రేవంత్రెడ్డి ప్రయాసపడక తప్పలేదు. మరోవైపు, తమ ప్రభుత్వాన్ని కూల్చుతారంటా అంటూ పరోక్షంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ‘ప్రజలకు మాపై కోపం వచ్చిందో.. లేక మార్పు కోరుకున్నారేమో.. కారణం ఏదైతేనేమి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. ఐదేండ్లు పాలించుకోమనండి.. మాకు అభ్యంతరం లేదు.. బాధ్యతాయుతమైన ప్రతిపక్షపాత్ర పోషిస్తాం’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టు విస్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ సీఎం రేవంత్రెడ్డి ఈ సభలో పెడబొబ్బలు పెట్టడం వెనుక పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి, ప్రజల్లో సానుభూతి పొందే వ్యూహం దాగిఉన్నది. ఐదేండ్లు పాలించుకోండని ప్రధాన ప్రతిపక్షమే అన్నాక ఇక ప్రభుత్వం ఏవిధంగా కూలుతుందో కనీస లాజిక్కూ లేకుండా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం విడ్డూరమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలితే గిలితే అది రేవంత్రెడ్డి నేతృత్వంలోనైనా, లేదా మరెవ్వరైనా మహారాష్ట్ర మాదిరిగా ఏక్నాథ్షిండేలా కేంద్రంలోని బీజేపీతో చేతులు కలిపితే తప్ప సాధ్యం కాదన్నది రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా చెప్తారు. కానీ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆరు నెలలు అయినా ఉండనీయరా? తమ ప్రభుత్వాన్ని కూల్చుతారంటా అంటూ పరోక్షంగా ప్రతిపక్ష బీఆర్ఎస్పై సీఎం రేవంత్రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేశారు.
పదేండ్లు కాంగ్రెస్దే అధికారం
రాష్ట్రంలో మరో పదేండ్లపాటు కాంగ్రెస్సే అధికారంలో కొనసాగుతుందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మోదీ ప్రధానిగా పదేండ్లు ఉండొచ్చు కానీ, ఇందిరమ్మ రాజ్యం, పేదోళ్ల ప్రభుత్వాన్ని ఆరు నెలలు కూడా ఉండనీయరట అని ధ్వజమెత్తారు. ‘మా ప్రభుత్వాన్ని టచ్ చూసి చూడండి. పాలమూరు బిడ్డలు మానవబాంబులై… ఎవరైనా మిగులుతరేమో చూస్తా.. ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలో వేసి ఊరేగుతా..’ అంటూ తన స్థాయిని మరచి, అసభ్యకర పదాలు వాడుతూ తన అసహనం, ఫ్రస్టేషన్ వెళ్లగక్కారు. నల్లమల నుంచి వచ్చిన తాను ఒక సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ సీఎం స్థాయికి వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 ఎంపీ సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. రాహుల్గాంధీని ప్రధాని సీట్లో కూర్చోబెట్టడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్రెడ్డి పేరును సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ సభలో మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.