హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఎక్సైజ్శాఖను ఆదేశించారు. హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధరల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకోవాలని సూచించారు. శనివారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, ఎక్సైజ్శాఖ అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో మద్యం సరఫరా చేయాలని ఆసక్తితో ఉన్న కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని, కనీసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్కు మద్యం సరఫరా చేస్తున్న కంపెనీలు, కొత్త బ్రాండ్లు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలకు అనుమతిచ్చే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని సూచించారు. కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఎక్సైజ్శాఖ మంత్రి, అధికారులను సీఎం ఆదేశించారు.
పాత కంపెనీలకు తలొగ్గేది లేదు
యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ(కింగ్ ఫిషర్) బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాత కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోని బీర్ల ధరలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. హైకోర్టు మాజీన్యాయమూర్తి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.