హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : టీజీఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం, ఆర్టీసీలో కార్మిక యూనియన్ల పునరుద్ధరణ తదితర అంశాలపై సీఎం రేవంత్రెడ్డి మరో మెలిక పెట్టారు. యూనియన్లు, విలీనం అంశాలపై ప్రణాళికాబద్ధంగా కార్మిక సంఘాలే చర్చించుకుని నిర్ణయం చెప్పాలని అన్నారు. శుక్రవారం రేవంత్ నివాసంలో ఆయనను కలిసిన కార్మిక సంఘాల నేతలతో మాట్లాడారు.
చర్చల సారాంశం మాకు పంపండి
‘ఆర్టీసీ విలీనం ఎలా చేద్దాం.. ఎన్నికలు ఎలా నిర్వహించుకుందాం అనే విషయాలపై మీ సంఘాలన్నీ కూర్చొని చర్చించుకోండి. ఆ చర్చల సారాంశాన్ని మాకు రాసి పంపండి. ఆస్తుల పంపకాలు, ఉద్యోగుల కేడర్, తదితర అంశాలన్నింటిపై చర్చలు జరపండి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు ఎవ్వరికీ అన్యాయం జరుగొద్దు.’ అని రేవంత్రెడ్డి కార్మిక సంఘాల నేతలతో చెప్పారు. ఆర్థిక అంశాలతో కూడిన పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, యూనియన్లు, విలీనం అంశాలపై శాశ్వత పరిషారం కోసం చర్చించుకుని ప్రభుత్వం ముందు ఫైనల్ ఆప్షన్స్ పెట్టాలని మెలిక పెట్టారు.
ఎందుకంటే ఆర్టీసీలో ఇప్పుడున్న కార్మిక సంఘాల్లో జేఏసీగా ఉన్న ఆరు సంఘాల్లో మినహా.. ఎవరుకూడా మరో సంఘం మాట వినే పరిస్థితి లేదు. సమ్మెకు జేఏసీ పిలుపునిస్తే.. దాన్ని నిర్వీర్యం చేసేందుకు నాన్ జేఏసీ పలుమార్లు ప్రయత్నించింది. ఈ క్రమంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వమే ఆ అంశాలను కార్మిక సంఘాల చర్చల్లో పెట్టడం చర్చలకు తావిచ్చింది. యూనియన్లలో ఐక్యత లేకపోవడంతోనే ప్రభుత్వం ఇలాంటి మెలిక పెడుతున్నదని నిపుణులు అంటున్నారు. కార్మికులు రాజకీయాల ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని, విలీనం, యూనియన్ల అంశాలపై ప్రణాళికాబద్ధంగా కార్మిక సంఘాలే చర్చించుకుని తుది నిర్ణయం చెప్పాలనడం సీఎం మాటల్లో కొసమెరుపు.
కేసుల ఎత్తివేతకు అంగీకారం
చర్చల సందర్భంగా ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదించిన.. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు, సమ్మె కాలంలో పెట్టిన కేసుల ఎత్తివేతకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గాజుల రామారంలో బస్ టెర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించామని, శంషాబాద్లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్ నిర్మిస్తామని, 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని రేవంత్ చెప్పారు.