CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలు విధించడంలేదని స్పష్టంచేశారు.
సచివాలయంలో గురువారం గృహజ్యోతి, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ పథకాలపై సమీక్షకు ముందు విద్యుత్తు కోతల మీద సాగుతున్న ప్రచారంపై అధికారులను ఆయన ప్రశ్నించారు. గత ఏడాదితో పోల్చితే గత రెండు నెలల్లో విద్యుత్తు సరఫరా ఎక్కువగా చేసినట్టు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రిజ్వీ సీఎంకు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంతో పోల్చితే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన ఘటనలపై విద్యుత్తుశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రిజ్వీ సమాచారం ఇవ్వగా, అందుకు కారణాలేమిటని సీఎం ప్రశ్నించారు. సబ్స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరిచూసుకుంటూ ఉండాలని, అలా చూడకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు సీఎంకు విన్నవించారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎం.. అలా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా మరమ్మతులు, ఇతర అంశాల వల్ల సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే ఆయా సబ్స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమాచారం తమకు ఉన్నదని తెలిపారు. ఎక్కడైనా ఐదు నిమిషాలకు మించి విద్యుత్తు సరఫరా నిలిచిపోతే, అందుకు గల కారణాలపై వెంటనే సమీక్షించుకోవాలని ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా కోతలకు కారణమైతే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్తు అవసరం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పీక్ సీజన్కు సరిపడేంత విద్యుత్తును అందించే కార్యాచరణను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసుకొన్నది. ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13 తేదీవరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయ్యింది. గత ఏడాది అదేకాలంలో 242.44 మిలియన్ యూనిట్లు సరఫరా అయ్యింది. నిరుడు జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా.. ఈ ఏడాది జనవరిలో 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయ్యిందని అధికారులు వివరించారు.