కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ కౌటాల, మే 5: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించేందుకు ఈ నెల 7న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా బరాజ్ను నిర్మించలేదు. కాలువలను తవ్వి వదిలేసింది. తదుపరి అనేక సాంకేతిక కారణాలరీత్యా కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2లక్షల ఆయకట్టుకు సాగునీరందించేందుకు అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును 20టీఎంసీలతో ప్రతిపాదించింది.
ప్రాజెక్టులోని మిగతా ఆయకట్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్దనే బరాజ్ను నిర్మిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ఈ నేపథ్యంలో 7న బరాజ్ నిర్మించే స్థలాన్ని సీఎం రేవంత్రెడ్డి పరిశీలించేందుకు వస్తున్నట్టు సమాచారం. సాంకేతిక అంశాల పరిశీలనకు సీఎం రేవంత్ పర్యటిస్తున్నట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీఎం రేవంత్రెడ్డి సభ కోసం పెద్ద ఎత్తున ఉపాధి కూలీలను వినియోగించి సభాస్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. అందుకోసం సాగులో ఉన్న మిరపతోటను తొలగిస్తున్నారు. ఉపాధి హామీలో భాగంగా రోడ్డు పనులు చేస్తున్న దాదాపు 60 మంది కూలీలను తీసుకొచ్చి మిరపతోటలో కాయలు తెంపి, తోటను తొలగించే పనులు చేపడుతున్నారు.