Telangana | ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యక్రమం ఎంచుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యమిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ దశలోనూ లబ్ధిదారులకు ఇబ్బంది కలగవద్దని.. అదే సమయంలో శాఖాపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సూచించారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థమంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.