హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర క్రమంగా తగ్గుతున్నదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రచించిన ‘గవర్నర్పేట టు గవర్నర్స్ హౌజ్’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో సీఎం ఆవిష్కరించారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడుతూ గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ వంటివారు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని, ఆ తర్వాత జైపాల్రెడ్డి, వెంకయ్యనాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని గుర్తు చేశారు.
ప్రస్తుతం తెలుగువారి పాత్ర కనిపించడమే లేదని, ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని, అదేస్థాయిలో నాయకత్వం కూడా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కేంద్ర క్యాబినెట్లో తెలుగువాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పారు. ఈ లోటును పూడ్చేందుకు అందరూ చొరవ చూపాల్సిన అవసరం ఉన్నదని పిలుపునిచ్చారు. గతంలో నంద్యాలలో పీవీ పోటీ చేసినపుడు.. ఏకగ్రీవం చేసేందుకు ఎన్టీఆర్ చొరవ చూపారని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఇది సత్సంప్రదాయమని, తమ ప్రభుత్వం కూడా దీనిని పాటిస్తుందని చెప్పారు. రాష్ర్టాలుగా విడిపోయినా మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.