హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ‘మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్’ దేనికీ పనికిరాదని సీఎం రేవంత్రెడ్డి మండలి సాక్షిగా తేల్చి చెప్పారు. భవిష్యత్తులో ఆ అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి పనికిరాదని సీఎం స్పష్టంచేశారు. అపార్ట్మెంట్లో ఉన్న వారు ఆ ఫ్లాట్ను ఏమీ చేసుకోలేరని, దానికి జీరో వాల్యూ అని మాత్రమే తాము చెప్తున్నామని వివరించారు. శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్రెడ్డి బదులిస్తూ… గాంధీ సరోవర్ నిర్మాణానికి 98 ఎకరాల డిఫెన్స్ భూమిని కేంద్రం ఇస్తున్నదని వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం, టూరిజం శాఖ వద్ద మరో 100 ఎకరాల భూమి ఈ ప్రాజెక్టు కోసం సిద్ధంగా ఉన్నదని వివరించారు. మధు రిడ్జ్ పార్క్ అపార్ట్మెంట్ తీసుకోకున్నా ఆ ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం స్పష్టంచేశారు.
2005-06లో అపార్ట్మెంట్కు తొమ్మిది మీటర్ల బఫర్జోన్ చూపించి అనుమతులు పొందారని తెలిపారు. 2012, 2016లో మూసీ నది పరీవాహక ప్రాంతంలో 50 మీటర్ల బఫర్జోన్ డిఫైన్ అయ్యిందని చెప్పారు. ఆ ప్రకారం మార్క్ చేస్తే ఈ అపార్ట్మెంట్ సగం బఫర్జోన్లోకి వస్తుందని వివరించారు. పలువురు జర్నలిస్టులు సోమవారం అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డిని కలిసిన సందర్భంలో ఆయన మధు రిడ్జ్ అపార్ట్మెంట్ అంశంపై స్పందించారు. ఇందులో కొంతమంది ముఖ్యులు మధు రిడ్జ్ అపార్ట్మెంట్లో ఉంటున్న కారణంగా వారి పట్ల తాను సానుకూలంగా ఉండే ప్రయత్నం చేశానని, కానీ అది వికటించిందని అన్నారు. అపార్ట్మెంట్వాసులకు ప్రత్యామ్నాయంగా స్థలం ఇవ్వడంతోపాటు మరో నివాస సముదాయం నిర్మించుకునేందుకు అవసరమైన నిధులు కూడా ఇస్తామని చెప్పారు. అయితే తొలుత ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించిన అపార్ట్మెంట్వాసులు ఆ తర్వాత మాట మార్చారని సీఎం ఆరోపించారు.
మూసీ ప్రాజెక్టుపై క్యాబినెట్ సబ్ కమిటీ
మూసీ ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు నేతృత్వంలో ఒక కమిటీ వేస్తామని శాసనమండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను కోరారు.