హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ, పెండింగ్ డీఏలపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీళ్లు చల్లారు. ఈ విషయంలో తాను ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేనని, క్యాబినెట్ భేటీ తర్వాత ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రేవంత్ వ్యాఖ్యలు తమను తీవ్ర నిరాశకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కీలకమైన సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏల విడుదలపై ప్రకటన ఉంటుందని ఉద్యోగ సంఘాలు భావించాయి. ఈ రెండు అంశాలను కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోనూ పొందుపరిచింది. ఇప్పుడేమో వీటిపై క్యాబినెట్, మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ బదిలీలు, హెల్త్కార్డులు, ఈ-కుబేర్లోని పెండింగ్ బిల్లులపై స్పష్టమైన హామీ వస్తుందని భావించినా, పరిష్కరిస్తామని చెప్పారు తప్పితే స్పష్టమైన హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రిజిస్టర్డ్ సంఘాలతో కాకుండా గుర్తింపు సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పడంపై కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సమావేశంలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్రావు, టీటీజేఏసీ నుంచి పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, జాక్టో నుంచి సదానందం, యూఎస్పీఎస్సీ నుంచి అశోక్కుమార్ సహా సింగరేణి, ఐఎన్టీయూసీ, స్టాఫ్నర్సు, విద్యుత్తు, కేజీబీవీ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగులకు తాము ఒకటో తేదీనే వేతనాలు జమచేస్తున్నా ప్రచారం చేసుకోవడం లేదని పేర్కొన్నారు. 11వేల పోస్టుల మెగా డీఎస్సీకి నోటీఫికేషన్ జారీచేశామని, మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని తెలిపారు. రోజుకు 18 గంటల పనిచేస్తూ పాలనను గాడిలో పెడుతున్నట్టు పేర్కొన్నారు. 95 శాతం మంది ఉద్యోగులు నిజాయతీగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. శాఖలవారీగా సంఘాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్టు తెలిపారు. సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. వివిధశాఖల్లో 1,100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సచివాలయం నుంచి కిందిస్థాయి వరకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం తీసుకురావడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. గవర్నర్తో మాట్లాడి ప్రొఫెసర్ కోదండరాంను శాసనమండలికి పంపిస్తామని, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శానసమండలికి గౌరవంగా ఉంటుందని పేర్కొన్నారు. 2008 డీఎస్సీ బాధిత అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
సీఎంతో సమావేశం సందర్భంగా భద్రతా సిబ్బంది కఠిన ఆంక్షలు విధించారు. సెల్ఫోన్లను నిషేధించారు. సమావేశానికి హాజరైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తమ ఫోన్లను బయట డిపాజిట్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. సీఎం రావడానికి ముందు పలు సంఘాల నేతలు తోసుకురావడంతో మరోదారిలేక సెల్ఫోన్లు ఉన్నా వారిని మాత్రం అనుమతించారు. సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత హర్షవర్ధన్రెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది మాట్లాడనివ్వలేదు. ఆయనకు పరిచయం చేసుకునే అవకాశం కల్పించడంతో పలు సమస్యలను వివరించే ప్రయత్నం చేశా రు. సీఎం సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఇక చాలు అంటూ సంకేతాలివ్వడంతో పూర్తిగా ప్రసంగించకుండానే కూర్చుండిపోయారు.
రాష్ట్రంలో సర్కారు స్కూళ్లు, కాలేజీలకు ఉచితంగా విద్యుత్తు అందిస్తామన్న సీఎం ప్రకటనను పీఆర్టీయూ టీఎస్ స్వాగతించింది. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పర్వత్రెడ్డి, సదానందంగౌడ్, టీఎస్జీహెచ్ఎం అధ్యక్షప్రధాన కార్యదర్శులు రాజభాను చంద్రప్రకాశ్, ఆర్యూపీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఎండీ అబ్దుల్లా, కాంతికృష్ణ, బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు హర్షం వ్యక్తంచేశారు.
ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు ఉచితంగా విద్యుత్తు అందిస్తామని సీఎం తెలిపారు. మంగళవారం జరిగే క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు యూనిఫాంతోపాటు పాఠశాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. గ్రీన్ చానల్ ద్వారా మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలని, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో సోలాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం.. వేసవి సెలవులు ముగిసే లోగా పనులు పూర్తిచేయాలని సూచించారు. పాఠశాలలకు సర్వీస్ పర్సన్లను నియమిస్తామని, ఇందుకు కావాల్సిన నిధులను హెచ్ఎంల ఖతాల్లో జమచేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ సీఎం రేవంత్రెడ్డిని కోరాయి. ఆదివారం ఆయా సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై వినతిపత్రం సమర్పించారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి ఉండాలని, గ్రామ, మండల స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను పెంచాలని కోరారు. రెవెన్యూ పరిపాలనలో రూరల్, సెమీ రూరల్, అర్బన్గా విభజిస్తే ప్రజలకు సేవలు సులభంగా, వేగంగా అందుతాయని వివరించారు. పూర్వ వీఆర్ఏల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగిందని, దీనికి అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్ను నిర్ణయించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లచ్చిరెడ్డి, రామకృష్ణ, ఎన్ఆర్ సరిత, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాములు, రమేశ్ పాక, అసోసియేట్ ప్రెసిడెంట్ పూల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.