CM Revanth Reddy | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీనపరిచే కుట్ర జరుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక బీఆర్ఎస్, బీజేపీ ఏకమై కాంగ్రెస్ను దొంగదెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ఈ జిల్లాలో కాంగ్రెస్ను ఓడించాలనేది అభ్యర్థుల మీద కోపంతో కాదని, తనను రాజకీయంగా దెబ్బతీసేందుకేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మేలు జరుగుతుందో, బీజేపీ గెలిస్తే మంచి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో వాల్మీకి బోయలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పదేండ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్ల మహబూబ్నగర్కు ఒక్కటంటే ఒక్క మేలు జరిగిం దా? అని ప్రశ్నించారు. బీజేపీలో జాతీయ పదవి తెచ్చుకున్న డీకే అరుణ..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయహోదా ఎందుకు తీసుకొనిరాలేదని నిలదీశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత డీకే అరుణ ఆర్డీఎస్ ద్వారా కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చారా? తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఒరిగేది ఏమిలేదని చెప్పారు. పదేండ్లలో మోదీ వల్ల జిల్లాకు ఏమైనా మేలు జరిగిందా? ఏదైనా పథకం వచ్చిందా? అని ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ గూడుపుఠాని చేయకపోతే అలంపూర్, గద్వాలలో కూడా కాంగ్రెస్ గెలిచేదని చెప్పారు. ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భ యపడే పరిస్థితి రాకూడదని వ్యాఖ్యానించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఓట్ల మెజార్టీతో గెలువబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు. ఫోన్ ట్యాపింగ్కు కారకులైనవారికి చర్లపల్లి జైలు తప్పదని హెచ్చరించారు. తమ ప్రభుత్వం వాల్మీకి బోయల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిశాక వాల్మీకి బోయల సంక్షేమం, అభివృద్ధి, విద్యలో సముచిత స్థానం కల్పించే బాధ్య తను తీసుకుంటామని హామీ ఇచ్చారు.