KTR : కొడంగల్ ఎమ్మెల్యే పదవికి సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారక రామారావు డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు నిరసన దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లగచర్ల, రోటిబండతండా, హకీమ్పేట్, పోలేపల్లి, పులిచెర్లకుంటతండా రైతులను కేటీఆర్ కలిశారు. అంతకు ముందు కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండలం తున్కిమెట్ల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికాయి. రైతు దీక్షలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి సర్కారు తెలంగాణలోని 25శాతం రైతులకు రుణమాఫీ ఇంకా జరుగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.73వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.17,500 బాకీ ఉందన్నారు. ఈ మొత్తం త్వరలోనే చెల్లించేలా చూస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కొడంగల్లో ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం తథ్యమని దీమా వ్యక్తం చేశారు. కొడంగల్లో ఉప ఎన్నిక వస్తే రేవంత్ను ఓడిద్దామని ప్రజలు చూస్తున్నారన్నారు. రేవంత్రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. ఉప ఎన్నికలు వస్తే తాము ప్రచారం చేయబోమన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 50వేల ఓట్ల మెజారిటీ తక్కువగా వచ్చినా, తాను రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉన్నాననన్నారు. తాను రైతు నిరసన దీక్షకు వస్తున్నట్లుగా లేదని.. కొడంగల్లో ఉప ఎన్నిక వచ్చి రేవంత్ రెడ్డి ఓడిపోయి పట్నం నరేందర్ రెడ్డి గెలిచాక చేసే విజయోత్సవ ర్యాలీకి వచ్చనా అన్నట్లుగా ఉందన్నారు. రేవంత్కు దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.
రేవంత్రెడ్డి సర్కారు వందశాతం రుణమాఫీ ఏ గ్రామంలోనైనా జరిగిందని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. అనుముల అన్నదమ్ముల కోసం, అదానీ కోసం, అల్లుడి కోసమే కొడంగల్ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా రేవంత్ అరాచకాలు చేస్తున్నాడని మండిపడ్డారు. తన మనుషుల కోసం కోట్ల విలువైన భూములను దోచిపెట్టేందుకే లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. అల్లుడికి కట్నం కింద ఇవ్వడానికే లగచర్ల భూములకు రేవంత్ సూటి పెట్టిండడని విమర్శించారు.
కౌరవరాజు దుర్యోధనుడిలా సంవత్సర కాలంగా అరాచకాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఎదురొడ్డి కొడంగల్ ఆడబిడ్డలు అన్నదమ్ములు పోరాడుతున్నారన్నారు. సంవత్సర కాలంగా లగచర్ల, కొడంగల్లో కురుక్షేత్ర యుద్ధం నడుస్తుందని.. 14 నెలల పదవీకాలంలో రైతులు, మహిళలు, వృద్ధులు, యువత కోసం రేవంత్రెడ్డి ఏ ఒక్క పని కూడా చేయలేదని మండిపడ్డారు. లగచర్ల భూములు తొండలు గుడ్లు పెట్టనవి అని రేవంత్ అబద్ధాలు చెప్పిండని.. ఎక్కడ చూసిన పచ్చని పంటపొలాలు ఉన్నాయని తెలిపారు. లంబాడి ఆడబిడ్డలు గడప దాటి బయటకు రారని.. అలాంటి వాళ్లు ఢిల్లీకి వెళ్లి న్యాయం కోసం అడిగేంత దుర్మార్గంగా రేవంత్ వ్యవహరించాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎకరానికి రూ.70 లక్షలు విలువ చేసే భూములను రూ.10 లక్షలకే గుంజుకోవాలని చూశారని.. ఎదురు తిరిగిన రైతులపై అక్రమంగా కేసులు బనాయించారని మండిపడ్డారు.
కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి జైలుకు వెళ్లిండని.. అర్ధరాత్రి పోలీసులను ఊరు మీదికి పంపి లంబాడి ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి అవమానించాడన్నారు. లగచర్ల జ్యోతి శివంగిలాగా ఢిల్లీలో లడాయి చేసిందని.. బంజారా ఆడబిడ్డల పోరాటంతోనే లగచర్ల రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని తెలంగాణ సమాజం ఎదురు చూస్తుందన్నారు. అడ్డి మారి గుడ్డి దెబ్బలాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండని.. రేవంత్ది రేషం లేని బతుకని.. లంకెబిందెలు ఉన్నాయి అనుకొని అడ్డమైన హామీలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడని విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. ఎకరానికి రూ.15 వేల సాయం చేస్తామని హామీ ఇచ్చి రూ.12 వేలు ఇస్తామంటున్నందుకు రేవంత్రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలన్నారు.
రుణమాఫీపై తాను గతంలోనే చాలెంజ్ చేశానని.. ఇప్పుడు కొడంగల్ గడ్డపై నుంచి సవాల్ చేస్తున్నానన్నారు. కల్వకుర్తి పక్కనే వెల్దండలో ఉన్న రేవంత్ సొంత భూముల్లో ఫార్మా కంపెనీలు పెట్టాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి తోడు బీఆర్ఎస్ ఒక్కో ఎకరానికి రూ.5లక్షల చొప్పున పరిహారం కలిపి ఇస్తుందన్నారు. తెలంగాణ నీ తాత జాగీర్ కాదని.. కేసీఆర్ ఉన్నంత కాలం ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే వాళ్ల పక్షాన కొట్లాడుతామన్నారు. దామరగిద్ద తండా రైతుల కోసం కూడా పోరాడుతామని.. రూ.4,350 కోట్లతో కొడంగల్కు నీళ్లు తెస్తానని చెప్పుకుంటున్నాడని.. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు.. కావాల్సిన మనుషులకు కమిషన్ ఇవ్వడానికి తప్ప కొడంగల్ ప్రజల కోసం ఏమాత్రం కాదన్నారు.