దేవుడి దయవల్ల సీఎం స్థానంలో ఉన్నారు. ఏబీవీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆరెస్సెస్లో పనిచేసిన రేవంత్రెడ్డి చాలా హుందాగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆయన అన్ని పార్టీలు మారారు. అంత అనుభవం ఉండి ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. జూబ్లీహిల్స్లో ఎంఐఎం పోటీపెట్టడం వల్లే కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఓడిపోయారని రేవంత్ అంటున్నారు.. మరి దళితుడైన అంబేద్కర్ను ఓడించిందెవరు? రేవంత్రెడ్డి జవాబు చెప్పాలె.
– అక్బరుద్దీన్
Congress | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘సీనియర్, ఆల్మైటీ బ్లెస్డ్.. పొలిటికల్ కెరీర్ ఏబీవీపీ నుంచి మొదలు పెట్టి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లో పనిచేసి పరిణతితో మాట్లాడతారని అనుకున్నాం.. వాట్ ఏ ఇమ్మెచ్యూర్డ్ టాక్’ అని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి గురువారం శాసనసభలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎక్కడి నుంచి పోటీచేయాలో చెప్పేందుకు తాము ఏ పార్టీకి మైనారిటీ సెల్ కాదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక జరిగిన తొలి శాసనసభ సమావేశాలు జరిగిన తీరు, ఆ పార్టీ ప్రభుత్వం అనుసరించిన తీరుపట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపి కేసీఆర్ సర్కార్ను బోనులో నిలబెట్టాలని చేసిన ప్రయత్నం బెడసికొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ అనేది వాస్తవం. రాష్ర్టానికి తాగునీళ్లు, సాగునీరు ఇచ్చింది, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది, అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చిన అంశం ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్న అంశాలు.. నిజాలను అబద్ధాలుగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు అనే తప్పుడు తతంగాన్ని మొదలుపెడితే అది అధికార పక్షానికే తిరగబడి బూమరాంగ్ అయిందనే వాదనకు బలం చేకూరుతున్నది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఏ అంశంపై మాట్లాడినా గణాంకాలతో సాధికారికంగా మాట్లాడతారని, ఆషామాషీగా మాట్లాడరని ప్రజలే కాకుండా రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. అటువంటి నాయకుడిపై సీఎం రేవంత్రెడ్డి ఇష్టారీతిగా మాట్లాడి తేలిపోయారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తలసరి ఆదాయాన్ని పెంచటంలో, తలసరి విద్యుత్తు వినియోగం పెంచటంలో, పరిశ్రమలకు నిరంతాయ విద్యుత్తును అందించటంలో ఆర్బీఐ, నీతి అయోగ్, కాగ్, బడ్జెట్ పత్రాలను ముందుపెట్టి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సాధికారికంగా సభ ముందు ఉంచటంలో సఫలీకృతమైందని నిపుణులు అంటున్నారు. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్తును ప్రారంభించినా దాన్ని అద్భుతంగా బీఆర్ఎస్ సర్కార్ కొనసాగించిదనటంలో సందేహం లేదని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు పేర్కొనటం కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టిందని అంటున్నారు.
కేసీఆర్ సర్కార్ను ఇరుకున పెట్టాలనే ఆరాటంలో సరైన కసరత్తు చేయకుండా రేవంత్ సర్కారు అభాసుపాలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనవసరంగా శ్వేతపత్రాల ఎజెండాను ఎత్తుకొని, వాటిపై విపక్షాలు ఎత్తిచూపిన అంశాలకు సరైన సమాధానం చెప్పలేక కాంగ్రెస్ చతికిలపడిందని అంటున్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వ్యక్తిగత అంశాలను తెరపైకి తెవటం ద్వారా ప్రభుత్వం తేలిపోయిందనే వాదన వినిపిస్తున్నది. ఎమ్మెల్యే హరీశ్రావును ఉద్దేశించి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ‘నువ్వు ఎన్నటికీ నాయకుడివి కాలేవు. నీకు కేసీఆర్, కేటీఆర్ ఎన్నటికీ అవకాశం ఇవ్వరు’ అని పేర్కొంటే అందుకు దీటుగా ‘డబ్బులు పెట్టి పీసీసీ పదవిని కొనుక్కున్నారని పరోక్షంగా సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడితే, తిప్పికొట్టే సమాధానం అధికార పక్షం దగ్గర లేకపోయింది. మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు.. ఇలా ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని అయోమయం కనిపించిందని అంటున్నారు.
అక్బరుద్దీన్ లేవనెత్తిన అంశాలను వర్గ దృష్టితో చూసి సమాధానం చెప్పాలని భావించి అధికార పక్షం బొక్కబోర్లా పడిందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పటం మా ఉద్దేశం కాదని, కరెంట్ విషయంలో బీఆర్ఎస్ను పూర్తిగా తప్పుపట్టడంలేదని, వాస్తవాలను ప్రజలకు చెప్పి తరువాత ఏం చేయాలో చేసే ప్రయత్నంలో భాగం మాత్రమేనని స్వయంగా సీఎం రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు చేసిన వ్యాఖ్యల పట్ల విస్మయం వ్యక్తం అవుతున్నది. ‘బాగాలేదని చెప్పనప్పుడు శ్వేతపత్రాలు ఎందుకు? జరిగిన అభివృద్ధి ప్రజల కండ్లముందు కనిపిస్తున్నప్పుడు కనికట్టు విద్యలెందుకు?’ అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా శ్వేతపత్రాల విడుదలతో వెనుక కాంగ్రెస్ ఏం చెప్పదలచుకున్నది? ఎన్నికల హామీలు వాయిదాల పద్ధతిపై అమలు చేస్తామని చెప్పటమా? అసలు వాటి జోలికే వెళ్లము అని చెప్పదలచుకున్నదా? రైతులకు 24 గంటల నిరంతాయ ఉచిత విద్యుత్తు అమలు చేస్తారా? చేయరా? గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పిన మాట నిలుపుకుంటుందా? లేదా? ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారా? చేయరా? వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా వెళ్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం సరైన వ్యూహాన్ని రచించుకోక బీఆర్ఎస్ను బోనులో నిలబెట్టాలని తానే బోనులో నిలబడిందనే చర్చ జరుగుతున్నది. బలమైన విపక్షం ఉన్నప్పుడు అంతకన్నా దీటైన వ్యూహాన్ని రచించి బీఆర్ఎస్ను దెబ్బతీయాల్సిందిపోయి దుందుడుకు చేష్టలతో తామే బొక్కబోర్లా పడ్డామనే అభిప్రాయం కాంగ్రెస్లో వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, విద్యుత్త్తుపై విడుదల చేసిన శ్వేతపత్రం విషయంలో కాంగ్రెస్ పార్టీ ముం దుచూపులేమితో ఇరుకునపడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘ప్రభుత్వ శ్వేతపత్రాలపై విపక్ష సభ్యులు పూర్తి కసరత్తుచేసి ఎండగట్టారు. సాధారణంగా తక్కువ సమయంలో అసెంబ్లీ పెడితే విపక్షాలు సన్నద్ధం కావని అధికార పక్షం అనుకున్నట్టున్నది. కానీ, వాళ్లు అనుకున్నదొక్కటి జరిగింది మరొకటి’ అని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. బీఆర్ఎస్లో మంత్రులుగా పనిచేసినవాళ్లు అనేక అంశాలపై సమగ్ర సమాచారంతో సాధికారికంగా చెప్పేసరికి అనేక అంశాల్లో అధికార పక్షానికి నోట మాటరాలేదని పేర్కొంటున్నారు. వెరసి శ్వేతపత్రాలు తప్పుల తడకగా మారాయని, ఆర్బీఐ, కాగ్, బడ్జెట్, ఏది తక్కువ ఉంటదో దాన్ని తీసుకొని కేసీఆర్ సర్కార్ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసి విఫలమైందని పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి కొద్దిగా టైం ఇద్దాం అనే పరిస్థితులు ఉంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హనీమూన్ కాలాన్ని సరిగ్గా వినియోగించుకోలేక చతికిలపడుతున్నది కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించటం గమనార్హం.