CM Revanth Reddy | మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి కేబినేట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రోహిత్ రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ప్రస్తుత సాధక బాధకాలపై సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏం చేయాలి.. ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి.. సలహాలు, సూచనలను అందించాలని సీఎం రేవంత్ కమిటీకి సూచించారు. నిర్ణీత గడువును నిర్దేశించుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని కోరారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశం ఏర్పాటు చేద్దామన్నారు.