హైదరాబాద్: ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏండ్లుగా పోరాటం చేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పువెలురించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసన సభలో తాను, సంపత్ కుమార్ వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. అప్పుడు తమను సభ నుంచి బహిష్కరించారని తెలిపారు. 2023, డిసెంబర్ 3న ప్రజా ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనమేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఎమ్మెల్యేల, అడ్వొకేట్ జనరల్ (AG)ను ఢిల్లీకి పంపించామన్నారు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని చెప్పారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాదిగ, మాదిక ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునిచ్చింది. సర్వోన్నత న్యాయస్థానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి ఏబీసీడీ వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేస్తామన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.