హైదరాబాద్: దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్టున్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని చెప్పారు. దేశంలోనే వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరుగుతున్నది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. భారీ రుణ భారం రాష్ట్రానికి సవాల్గా మారిందని చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. గత పదేండ్లలో మౌలికవసతుల కోసం ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకున్నదని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరారు. రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని లేదా అదనపు ఆర్థిక సహాయం అందించాలన్నారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాన్నారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్ను మీ ముందు ఉంచుతున్నామన్నారు. తమ డిమాండ్ను నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకారిస్తామని వెల్లడించారు. తెలంగాణను తాము ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రానికి తగినంత సహాయం అందించాలన్నారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నేరవేరుస్తామని చెప్పారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో తమ మద్దతు కోరుతున్నామని, తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తమ సిఫారసులు ఉపయోగపడతాయని వెల్లడించారు.