హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త కొలమానాన్ని నిర్దేశించారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు తెల్ల రేషన్కార్డును ప్రాథమిక అర్హతగా నిర్ణయించామని తెలిపారు.
సచివాలయంలో సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే వర్తించాలని రేషన్కార్డు నిబంధనను పెడుతున్నామని వెల్లడించారు. రేషన్కార్డు లేనివారికి కార్డులు ఇస్తామని, లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. నిరుపేదలు, నిస్సహాయులు ఎవరనేది గుర్తించడానికి ఒక కొలమానం ఉండాలని అన్నారు. లేకపోతే అందరికీ పథకాలను వర్తింపజేస్తే కోటీశ్వరులు కూడా దరఖాస్తు చేసుకుంటారని చెప్పారు.
పోటీ పరీక్షల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటుచేసి ఆన్లైన్లో ప్రముఖులు, నిపుణులతో పాఠాలు చెప్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రైతుబంధును జనవరిలో మొదలుపెట్టామని, మార్చి 31 నాటికి పూర్తిగా చెల్లిస్తామని చెప్పారు. కేవలం 15 రోజుల్లోనే రైతుబంధు చెల్లించవచ్చని.. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు, హాస్టల్ పిల్లలకు నిధులు విడుదల చేయాల్సి ఉన్నదని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు
బీఆర్ఎస్, బీజేపీ గత పదేండ్లలో విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలు, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి చర్చించడానికి సిద్ధమా? అని సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశంలో చెప్తున్న విషయాలనే.. బీజేపీ నేతలు కూడా పొల్లుపోకుండా ప్రెస్మీట్లో చెప్తున్నారని విమర్శించారు.
ఎప్పటిమాదిరిగానే కాళేశ్వరంపై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించామని గత ప్రభుత్వం చెప్పిందని.. మిషన్ భగీరథ, కాళేశ్వరంతో ఏమైనా ఆస్తి సృష్టించారా? అని ప్రశ్నించారు. ‘అప్పు తెచ్చినప్పుడు దానిని పెట్టుబడిగా పెట్టి.. ఆదాయం వచ్చినప్పుడు అప్పు కట్టాలి. మిషన్ భగీరథకు రూ.50 వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు. లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టారు. ఒక్క రూపాయి అయినా ఆదాయం సృష్టించి.. వచ్చిన ఆదాయంతో అప్పు కట్టారా?’ అంటూ వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ కుంగిందని.. అన్నారం పగిలిపోయిందని చెప్పారు. ‘నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. కాళేశ్వరం కూలిపోకపోయి ఉంటే.. వారు చేసిన తప్పిదాలపై చర్చ కొంత తక్కువ జరిగి ఉండేది. ఇవ్వాళ మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం పగిలిపోయిందని చెప్తుంటే.. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోయమంటున్నారు. వితండ వాదనతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ విమర్శలు గుప్పించారు.
ప్రాజెక్టుల ద్వారా ఆదాయం వస్తుందని బ్యాంకులకు చెప్పి, ప్రభుత్వానికి వచ్చే నికర ఆదాయాన్ని అప్పుల కింద కట్టే పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. అందుకే ఆర్థిక సంక్షోభం వచ్చిందని పేర్కొన్నారు. 2014లో రూ.72 వేల కోట్ల అప్పులు ఉండగా.. అవి నేడు రూ.7 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. నాడు అప్పు కింద ఏటా రూ. 6 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తే.. నేడు రాష్ర్టానికి ఏటా రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం వస్తుండగా.. అప్పు కింద రూ.70 వేల కోట్లు చెల్లించాల్సి వస్తున్నదని అన్నారు.
కాళేశ్వరం జలాలతో పెరిగిన భూగర్భజలం, వాటి ఫలితంగా పెరిగిన పంట విస్తీర్ణం, గణనీయంగా పెరిగిన దిగుబడి, తద్వారా రైతులకు పెరిగిన ఆదాయం వంటి అంశాలను సీఎం విస్మరించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ విస్తీర్ణం పెరిగింది కదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. రాష్ట్రం వచ్చినప్పుడు 18 లక్షల పంపుసెట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 29 లక్షలకు పెరిగాయని అన్నారు.
అదనంగా వచ్చిన 11 లక్షల పంపుసెట్ల కింద సుమారు 40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు పెరిగిందని, అందుకే ఉత్పత్తులు కూడా పెరిగాయని వివరించారు. అంతే తప్ప గత ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరిగాయని, నాణ్యమైన ఉచిత విద్యుత్తు వల్లే రైతులు సాగు విస్తీర్ణం పెరిగిందని, పంపుసెట్ల వినియోగం పెరిగిందంటూ పలువురు నిపుణులు పేర్కొన్న విషయాన్ని మాత్రం సీఎం అంగీకరించలేదు.