చొప్పదండి, ఫిబ్రవరి 6 : అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పేరిట కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో గురువారం నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. చొప్పదండిలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి భయపడే ముఖ్యమంత్రి చొప్పదండిలో సభ నిర్వహించారని ఆరోపించారు. ఏ సభలోనైనా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు పేర్లు ప్రస్తావించకుండా రేవంత్రెడ్డి ఉండలేరని మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవాచేశారు.
ముఖ్యమంత్రి ప్రసంగంలో పసలేదని ప్రజలు వెళ్లిపోవడం సిగ్గుచేటని పేరొన్నారు. రెండేండ్లలో చొప్పదండి నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులు గుండు సున్నా అని విమర్శించారు. తన హయాంలో ప్రారంభించిన పనులను ఇప్పటికీ పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. కొండగట్టు అభివృద్ధికి కృషి చేయాలని, నారాయణపూర్ రిజర్వాయర్ను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరినా సీఎం దాని గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. మూడు నెలల కిందనే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన పనులనే మళ్లీ సీఎం శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లతో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్-బీజేపీ అన్నదమ్ములు: గెల్లు
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అన్నదమ్ముల వలె కలిసి ఉండి బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ మోసపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు. రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మున్సిపాలిటీకి కూడా ఒక్క రూపాయి మంజూరు చేయలేదని విమర్శించారు.