హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ లాంటి రిజర్వాయర్లన్నింటినీ తాగునీటికి వాడుకోవాలని తెలిపారు. దీంతో చుట్టుపకల ఉన్న గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయటం సులభం అవుతుందని, తకువ ఖర్చు అవుతుందని వెల్లడించారు.
మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాలపై సీఎం సమీక్ష నిర్వహించి.. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ విధులను సర్పంచులకు అప్పగించాలని సూచించారు. ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను వాళ్లకే ఇవ్వాలని తెలిపారు. నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోతుందని, అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని అన్నారు. గ్రామాల వరకు రక్షిత మంచి నీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగు నీరు అందని ప్రాంతాలు, ఆవాసాలపై సమగ్రంగా సర్వే చేయాలని ఆదేశించారు. జల్జీవన్ మిషన్ నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయించిన రూ.10 కోట్లలో రూ.1 కోటిని తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు, హాబిటేషన్లకు రోడ్లు నిర్మించాలని సీఎం ఆదేశించారు. 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు తెలుపగా, వీటన్నింటికీ తారురోడ్లు వేయాలని సీఎం సూచించారు. అవసరమైతే ఉపాధిహామీ నిధులను లింక్ చేసి పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ సూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థినీవిద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్లు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక, రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.