CM Revanth Reddy | సచివాలయంలో నీటి పారుదలశాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందన్నారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై రేవంత్ ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని, పూర్తి చేస్తే 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చన్నారు. కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.